అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఇటీవల రూ.95 మార్కును తాకిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా, పటిష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇటీవల లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి పతనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మూలాధారాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె తెలిపారు.
రూపాయి భేష్
రూపాయి విలువ తగ్గుదలపై స్పందిస్తూ, ‘మిగిలిన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పరిస్థితి బాగుంది. ఇది మెరుగైన స్థితిలోనే ఉంది’ అని మంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ఇస్తున్నాయని, ముఖ్యంగా మన ద్రవ్యలోటు నిర్వహణ, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు రూపాయికి రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
గణాంకాలు ఇలా..
మంత్రి సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం, మార్చి 27 నాటికి విలువ డాలర్తో పోలిస్తే రూపాయి రూ.94.82 వద్ద ముగిసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 27, 2026 మధ్య కాలంలో రూపాయి విలువ 9.9 శాతం మేర తగ్గింది. ఫిబ్రవరి 28న మిడిల్ఈస్ట్ దేశాల్లో మొదలైన ఉద్రిక్తతల కారణంగా రూపాయి 4.1 శాతం మేర క్షీణించింది.
ఆర్బీఐ పర్యవేక్షణ
రూపాయి విలువ అనేది మార్కెట్ బాహ్య పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడుతుందని, దీనికి ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా పరిమితిని విధించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే, ఎఫ్డీఐ మార్కెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం పర్యవేక్షిస్తోందని, విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. విదేశీ మారకద్రవ్యం రాకను పెంచడానికి, ఇతర దేశాల్లో రూపాయి ఆమోదాన్ని పెంచడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు


