
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.
మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు.