నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఖర్చులను గణనీయంగా పెంచింది. సామజిక కార్యక్రమాల కోసం ఏకంగా రూ.2248 కోట్లు ఖర్చు చేసింది. ఇది గత సంవత్సరం (రూ.2156 కోట్లు)తో పోలిస్తే సుమారు రూ.100 కోట్లు ఎక్కువ.
కోవిడ్ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం సీఎస్ఆర్ ఖర్చు రూ.9,500 కోట్లు దాటింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరింది.
ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఒక డెయిరీ రైతు ఆదాయం గణనీయంగా పెరిగి రెండింతలయింది. అంతే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్ కోసం స్కాలర్షిప్ సదుపాయాలను అందిస్తున్నారు.
2020-21లో ప్రారంభమైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కార్యక్రమం ప్రతి సంవత్సరం సుమారు 5,100 మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది. వీరిలో చాలామంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందారు. వారి కుటుంబాల ఆర్థిక స్థితిలో పురోగతికి సహాయపడుతున్నారు. ఇది సమాజంలో దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు.
Reliance Foundation ka impact badhta ja raha hai! 💛 FY26 mein CSR spending Rs 2,248 crore tak pahunchi, aur education, healthcare, rural development aur sports projects ko support kiya. Ek strong aur healthy India ki taraf ek aur kadam.#RelianceFoundation pic.twitter.com/8s5lDMIOrg
— Reliance Update (@RelianceUpdate_) May 29, 2026
మహిళా సాధికారత విషయంలో కూడా స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ లిటరసీ, ఆర్థిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళల్లో 75% మందికి ఆర్థిక నిర్ణయాలపై విశ్వాసం పెరిగింది. సగం మంది కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మరింతగా పాల్గొంటున్నారు.
జంతు సంరక్షణ రంగంలో వంతారా ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులకు సంరక్షణ అందించారు. దీనికిగాను అనంత్ అంబానీకి 2025లో గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. నీతా అంబానీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో హ్యూమానిటేరియన్ అవార్డులు వచ్చాయి.
గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాడి రైతుల రోజువారీ పాలు ఉత్పత్తి 6.14 లీటర్ల నుంచి 10.37 లీటర్లకు పెరిగింది. వారి వార్షిక ఆదాయం సుమారు 64.6% పెరిగింది. మొత్తం కుటుంబ ఆదాయం కూడా సుమారు 56% వరకు పెరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఫౌండేషన్ సేవలు అందించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో వచ్చిన తుపాను హెచ్చరికల సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి మత్స్యకారులు, రైతులను అప్రమత్తం చేసింది. ఈ సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా రిలయన్స్ ఫౌండేషన్ సామజిక కార్యక్రమాల కోసం ప్రతి ఏటా భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది.


