కరోనా విపత్తు రోజుల మాదిరి తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) విధానానికి మళ్లాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మర్నాడే ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఇందుకు అనుకూలంగా స్పందించింది.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఐటీ కంపెనీలు రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ నమూనా (కొన్ని రోజులు కార్యాలయం, కొన్ని రోజులు ఇంటి నుంచి)కు వీలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ విధులు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
‘‘పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో కంపెనీలు క్యాంపస్లలో ఇంధన నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. అవసరం లేని వసతుల వినియోగాన్ని క్రమబద్దీకరించుకుంటున్నాయి. అవసరానికి అనుగుణంగా రిమోట్, హైబ్రిడ్ పని నమూనాలతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి’’అని నాస్కామ్ తన ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తున్నామని.. పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వంతో సంప్రదిస్తూ, సమన్వయంతో దీన్ని అధిగమిస్తామని పేర్కొంది.
నాస్కామ్లో 3,500 ఐటీ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొన్ని అంశాలపై పిలుపునివ్వడం తెలిసిందే. కరోనా సమయంలో అనుసరించిన వర్చువల్ (ఆన్లైన్) సమావేశాలు, సదస్సులతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్కు మళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.


