బీమాతో సైబర్‌ మోసాలకు చెక్‌! | Personal Cyber Insurance a Protection Against Digital Threats | Sakshi
Sakshi News home page

బీమాతో సైబర్‌ మోసాలకు చెక్‌!

Apr 14 2025 4:46 AM | Updated on Apr 14 2025 8:00 AM

Personal Cyber Insurance a Protection Against Digital Threats

గణనీయంగా పెరిగిన డిజిటల్‌ చెల్లింపుల

స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఆర్థిక లావాదేవీలు 

భిన్న మార్గాల్లో విరుచుకుపడుతున్న సైబర్‌ నేరగాళ్లు 

ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, లింక్‌లతో మోసాలు 

ఆర్థికంగా కోలుకోలేని నష్టం

 సైబర్‌ ఇన్సూరెన్స్‌తో వీటి నుంచి రక్షణ

ఐటీ ఉద్యోగి వంశీరామ్‌ (32) మొబైల్‌కు ఒక సందేశం వచ్చింది. విద్యుత్‌ బిల్లు గడువు ముగిసిపోయిందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్‌ నిలిపివేస్తామని అందులో ఉంది. వెంటనే లింక్‌పై క్లిక్‌ చేసి చెల్లించేశాడు వంశీ. కానీ, ఖాతా నుంచి రూ.80,000 డెబిట్‌ అయిపోవడం చూసి నిర్ఘాంతపోయాడు. ఇలాంటివి రోజుకు వేలాది ఘటనలు జరుగుతున్నాయి. 

గ్రోసరీ షాపింగ్, సోషల్‌ మీడియా ముచ్చట్లు, వర్తకులకు క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు, యుటిలిటీ బిల్లులు, బ్యాంకింగ్‌ సేవలు.. నేడు లావాదేవీలన్నీ మొబైల్‌ ఫోన్ల నుంచే. దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌ రూపంలోకి మళ్లాయి. సౌకర్యంగా ఉండడంతో అందరూ స్మార్ట్‌ఫోన్‌ నుంచే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ఇది సైబర్‌ మోసాలకు అడ్డాగా మారిపోయింది. ఏటా 15 లక్షల సైబర్‌ మోసాలు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్‌ మోసాల నుంచి రక్షణ కల్పించుకోవడంపై తప్పకుండా దృష్టి సారించాలి. దీని గురించి అవగాహన కల్పించే కథనం ఇది...           


2018లో సైబర్‌ నేరాలు 2.08 లక్షలు కాగా, ఇప్పుడు ఏటా 15 లక్షలకు చేరాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. బాధితులు అందరూ బయటకు చెప్పుకోలేరు. కనుక, ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. సైబర్‌ నేరాలతో ఆర్థికంగా నష్టపోవడమే కాదు, మానసికంగా ఎంతో వేదనకు గురికావాల్సి వస్తుంది. 

ఈ ఇబ్బందుల నుంచి ఆదుకునేదే సైబర్‌ ఇన్సూరెన్స్‌. దేశంలో 84 శాతం ఇంటర్నెట్‌ యూజర్లు ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. షాపింగ్, బ్యాంకింగ్‌ లేదా సోషల్‌ మీడియా చాటింగ్, ఆన్‌లైన్‌ కార్యకలాపాలు ఏవైనా సరే... ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ డేటా లీకేజీ, సైబర్‌ దాడులు, మోసాల రిస్క్‌ ఉంటుంది. 

సైబర్‌ నేరస్థులు డీప్‌ఫేక్‌ టెక్నాలజీ, ఏఐ తదితర అత్యాధునిక టెక్నాలజీలతో దాడులకు దిగుతున్నారు. ఆన్‌లైన్‌లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ బుకింగ్‌ను సైతం తప్పుదోవ పట్టించి.. నకిలీ లింక్‌ ద్వారా బ్యాంక్‌ ఖాతా ఊడ్చేస్తున్న ఘటనలు వింటున్నాం. టెక్నాలజీ గురించి పెద్దగా పరిచయం లేని విశ్రాంత జీవుల నుంచి జీవితకాల పొదుపు నిధులను మాయం చేస్తున్నారు. 

నేడు ప్రపంచం మొత్తం డిజిటల్‌గా అనుసంధానమై ఉంది. దీంతో నేరగాళ్లు ఏదో ఒక దేశంలో ఉండి, మరో దేశంలోని వారిని సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఒకవైపు సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతుంటే.. మరోవైపు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్న వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేకపోవడం ఒకటి అయితే, తాము జాగ్రత్తగా ఉంటామన్న ధీమా కొందరిని బీమాకు దూరంగా ఉంచుతోంది.  


సైబర్‌ రక్షణ...
సైబర్‌ మోసాల వల్ల జరిగే నష్టాన్ని పాలసీదారులకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ చెల్లిస్తుంది. రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు సమ్‌ అష్యూర్డ్‌ (బీమా) తీసుకోవచ్చు. రూ.లక్ష కవరేజీకి ప్రీమియం సుమారు రూ.600 వరకు.. రూ.కోటి కవరేజీకి రూ.25,000 వరకు ఉంటుంది. సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి దురి్వనియోగం చేయడం, సైబర్‌ వేధింపులు, బెదిరింపులు, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం వంటి కేసుల్లో.. చట్టపరమైన చర్యలకు అయ్యే వ్యయాలను బీమా కంపెనీ చెల్లిస్తుంది. 

మాల్వేర్, రాన్సమ్‌వేర్‌ రక్షణ కూడా ఉంటుంది. మాల్వేర్‌ దాడుల కారణంగా సర్వర్, నెట్‌వర్క్, కంప్యూటర్లకు వాటిల్లే నష్టానికి పరిహారం లభిస్తుంది. సైబర్‌ నేరస్థులు డివైజ్‌ను (మొబైల్‌ లేదా పీసీ/ల్యాప్‌టాప్‌) హ్యాక్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డేటా రికవరీకి, డివైజ్‌ రిపేర్‌ వ్యయాలను బీమా కంపెనీ భరిస్తుంది. డేటా చోరీతో వాటిల్లే నష్టాన్ని భర్తీ చేస్తుంది. 

ఆన్‌లైన్‌ బ్లాక్‌ మెయిల్, సైబర్‌ బుల్లీయింగ్‌ తదితర ఘటనల్లో న్యాయపరమైన చర్యలకు, సాంకేతిక సాయానికి అయ్యే వ్యయాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. సైబర్‌ ఇన్సూరెన్స్‌లోనూ విభిన్న ప్లాన్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలకు సంబంధించి కూడా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయి. మొబైల్‌ వాలెట్లకూ రక్షణ కల్పించుకోవచ్చు. ఈమెయిల్‌ స్పూఫింగ్‌ దాడి వల్ల ఎదురయ్యే ఆర్థిక నష్టం, నేరస్థులపై చర్యలకు అయ్యే వ్యయాలకూ చెల్లింపులు ఉంటాయి. సందేశాలు పంపడం, ఫోన్‌ కాల్స్, నకిలీ వెబ్‌సైట్‌ల ద్వారా సున్నితమైన డేటాను పొందడం ద్వారా ఆర్థికంగా నష్టం కలిగించడం వంటి ఫిషింగ్‌ దాడుల నుంచి రక్షణ పొందొచ్చు.  

ఎంత కవరేజీ అవసరం? 
కంపెనీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఫైర్‌వాల్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌తో సైబర్‌ దాడుల నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అదే మాదిరి వ్యక్తులు సైతం తమ వంతుగా సైబర్‌ బీమా రక్షణను తీసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ముందుగా బ్యాంక్‌ ఖాతాల్లో బ్యాలెన్స్, క్రెడిట్‌ కార్డ్‌ లిమిట్, ఈ–వ్యాలెట్‌ ఇలా సైబర్‌ దాడుల రిస్క్‌ ఉన్న పెట్టుబడుల విలువను ఒకసారి పరిశీలించాలి. మీ లిక్విడ్‌ అసెట్స్‌ విలువకు సరిపడా కవరేజీ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. తరచూ, అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి అధిక కవరేజీ అవసరం.  

వీటికి కవరేజీ రాదు.. 
సైబర్‌ ఇన్సూరెన్స్‌లో మినహాయింపులు కూడా ఉంటాయి. వీటి గురించి పాలసీదారులు ముందుగానే సమగ్రంగా తెలుసుకోవాలి., చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యవహారాలు, లావాదేవీలు, ఉద్దేశపూర్వక ఉల్లంఘనల కారణంగా జరిగే నష్టానికి ఇందులో పరిహారం రాదు. వాణిజ్య రహస్యాలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి ఎదురయ్యే చెల్లింపుల బాధ్యతలకూ ఇందులో మినహాయింపులు ఉన్నాయి. యుద్ధం, సైబర్‌ యుద్ధం, సహజ ప్రమాదాల కారణంగా వాటిల్లే నష్టానికీ రక్షణ ఉండదు. క్రిప్టో పెట్టుబడులు, గ్యాంబ్లింగ్, మోసపూరిత చర్యలు, అనధికారికంగా డేటా సమీకరించడం, నిషేధిత సైట్లలోకి ప్రవేశించడం వల్ల వాటిల్లే నష్టం తదితర వాటికి సైబర్‌ బీమాలో కవరేజీ ఉండదు.  

వెంటనే రిపోర్ట్‌ చేయాలి.. 
మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే వెంటనే బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి వాటి ఖాతా/క్రెడిట్‌/డెబిట్‌కార్డుల యాక్సెస్‌ను తాత్కాలికంగా బ్లాక్‌ చేయించాలి. వెంటనే బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించాలి. 1930కు కాల్‌ చేసి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి. పోలీసుల వద్ద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం, ఆ కాపీ తీసుకుని బీమా కంపెనీ వద్ద నిబంధనల మేరకు క్లెయిమ్‌ దాఖలు చేయాలి. బ్యాంక్‌/ఎన్‌బీఎఫ్‌సీ వద్ద ఫిర్యాదుకు సంబంధించి రుజువులను జత చేయాలి. జరిగిన నష్టానికి సంబంధించి ఆధారాలూ సమర్పించాలి.  

సైబర్‌ టిప్స్‌.. 
→ చాలా మంది ఆన్‌లైన్‌ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం సైబర్‌ దాడులకు అవకాశం ఇచి్చనట్టు అ వుతోంది. ప్రతి ఒక్కరూ తమవంతు రక్షణ చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. 
→ స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లలో సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. 
→ తెలియని వెబ్‌సైట్లను యాక్సెస్‌ చేయకుండా ఉండాలి. 
→ గూగుల్‌ సెర్చ్‌లో శోధించే క్రమంలో ఎదురయ్యే వెబ్‌ పోర్టళ్లు, కాంటాక్టుల వివరాలు, చిరునామాలు నిజమైనవేనా? అన్న పరిశీలన తర్వాతే ముందుకు వెళ్లాలి. 
→ డొమైన్‌ చిరునామాలో హెచ్‌టీటీపీఎస్‌ లేకపోతే యాక్సెస్‌కు దూరంగా ఉండాలి.  
→ బలహీన పాస్‌వర్డ్‌లు కాకుండా.. స్మాల్, క్యాపిటల్‌ లెటర్లు, స్పెషల్‌ క్యారెక్టర్లు, నంబర్లతో కూడిన పటిష్ట పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలి. 
→ పబ్లిక్‌ వైఫై, ఉచిత నెట్‌ వర్క్‌ల యాక్సెస్‌కు దూరంగా ఉండాలి 
→ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2ఎఫ్‌ఏ)ను ఎనేబుల్‌ చేసుకోవాలి.  
→ ఫోన్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్, యాప్‌లు, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి.  
→ సోషల్‌ మీడియాలో వ్యక్తిగత వివరాలను కొత్తవారు యాక్సెస్‌ చేయకుండా నియంత్రణలు పెట్టుకోవాలి. 
→ మెయిల్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే యూఆర్‌ఎల్‌ లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు. అవి విశ్వసనీయ సంస్థల నుంచి వచి్చనవేనా అన్నది ధ్రువీకరించుకోవాలి. 
→ పేమెంట్‌ యాప్‌లు సహా అన్ని ముఖ్యమైన యాప్‌లకు ఫింగర్‌ ప్రింట్‌ లాగిన్‌ ఎనేబుల్‌ చేసుకోవాలి.  
→ ఎప్పటికప్పుడు ముఖ్యమైన డేటాను క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి బ్యాకప్‌ తీసుకోవాలి.   
→ ఓటీపీలు, ఆధార్, పాన్, బ్యాంక్‌ ఖాతా, చిరునామా, ఫోన్‌ నంబర్లు ఇలా కీలక వివరాలను ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో ఎవరితోనూ పంచుకోరాదు.  
→ ఈ జాగ్రత్తలతోపాటు తగినంత రక్షణ కవరేజీతో సైబర్‌ బీమా తీసుకోవడం మరవొద్దు.  

హెచ్‌ఏఎల్‌కు నేరగాళ్ల బురిడీ
ప్రభుత్వరంగ రక్షణ ఉత్పత్తుల కంపెనీ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ను సైతం సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించడం గమనార్హం. కంపెనీ కాన్పూర్‌ శాఖను తప్పుదోవ పట్టించి రూ.55 లక్షలు కాజేశారు. యూఎస్‌కు చెందిన పీఎస్‌ ఇంజనీరింగ్‌ ఐఎన్‌సీ నుంచి హెచ్‌ఏఎల్‌ విడిభాగాలు కొనుగోలు చేయాలనుకుంది. కంపెనీ అధికారిక ఈ మెయిల్‌తో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థల మధ్యలో సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించారు. యూఎస్‌ కంపెనీ పీఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారిక ఈమెయిల్‌ చిరునామాలో ఒక ఇంగ్లిష్‌ ‘ఇ’ తొలగించి, మిగిలిన అక్షరాలన్నీ ఉండేలా ఈమెయిల్‌ ఐడీ సృష్టించి హెచ్‌ఏఎల్‌తో సంప్రదింపులు చేశారు. రూ.55 లక్షల అడ్వాన్స్‌ను తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు. జరిగిన మోసాన్ని హెచ్‌ఏల్‌ ఆలస్యంగా గుర్తించింది. అలాగే, ఆ మధ్య ఓ ప్రముఖ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెందిన కీలక డేటా లీక్‌ అయ్యింది. 68,000 డాలర్లు చెల్లించాలంటూ హ్యాకర్‌ డిమాండ్‌ చేశాడు.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement