ఆధార్తో లింక్ చేసుకోని పాన్ కార్డులు వచ్చే జనవరి 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే తమ ఆధార్తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.
ఆధార్, పాన్ కార్డులు.. రెండూ దేశంలో అత్యంత ముఖ్యమైన ధ్రువ పత్రాలు. ఒకటి దేశ పౌరుడిగా విశిష్ట గుర్తింపును తెలియజేసేదైతే మరొకటి ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. పన్ను ఎగవేతలను అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. దీనికి గడువును మాత్రం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2024 అక్టోబర్ 1వ తేదీకి ముందు జారీ చేసిన పాన్ కార్డులను 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకోవాలని గడువు విధించింది. ఆ లోపు లింకింగ్ పూర్తి కాకపోతే అలాంటి పాన్కార్డులు చెల్లుబాటు కావని సీబీడీటీ గతంలో వెల్లడించింది. ఇప్పుడా గడువు సమీపిస్తోంది. ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..
ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్లో మీ పాన్, ఆధార్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఈ దశలను అనుసరించండి..
అధికారిక ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లండి.
"లింక్ ఆధార్" పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.
ఇప్పుడు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.
ఒకవేళ మీ పాన్ ఇప్పటికే ఇనాక్టివ్గా ఉంటే, మొదట రూ .1,000 లింకింగ్ ఫీజు చెల్లించాలి.
లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్పై క్లిక్ చేయండి.


