ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త లేఆఫ్స్ విడతలో ప్రపంచ వ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇందులో భారత్లోని ఇంజినీరింగ్, క్లౌడ్ సేవల విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది టెక్కీలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తగ్గిన ఉద్యోగులు
సరికొత్త క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి బిలియన్ల కొద్దీ డాలర్లను తరలిస్తున్న ఒరాకిల్, ఇతర విభాగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలోనే కంపెనీ తన గ్లోబల్ హెడ్కౌంట్ను 1,62,000 నుంచి 1,41,000కి (సుమారు 21,000 ఉద్యోగాలు) తగ్గించుకుంది.
ఏఐ ప్రభావమే..
కంపెనీ వార్షిక నివేదికలో సైతం ‘ఏఐ సాంకేతికత వినియోగం కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల తగ్గింపులు కొనసాగవచ్చు’ అని ఒరాకిల్ స్పష్టం చేయడం గమనార్హం. డేటా సెంటర్ల విస్తరణ, ఏఐ టెక్నాలజీ పోటీలో నిలదొక్కుకోవడానికి భారీ పెట్టుబడులు పెడుతున్న కంపెనీ, అందుకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేయడానికి ఈ తొలగింపులను సాధనంగా వాడుతోంది. భారతదేశంలోని క్లౌడ్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 నుంచి 3,000 మంది టెక్కీలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అతి త్వరలో నిర్ణయం
ఈ సెప్టెంబర్ నెలలోనే (ముఖ్యంగా సెప్టెంబర్ 15 నాటికి) ఈ నిర్ణయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11న వెలువడనున్న కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వేళ ఈ తొలగింపుల ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. తీవ్ర వ్యయ నియంత్రణల దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడం, సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ వేగంగా వస్తుండటంతో భారతీయ టెక్ రంగానికి రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..


