వంటకు త్వరలో స్టవ్లు రెడీ
బయోఇంధన వినియోగంపై దృష్టి
కుటుంబాలకు ప్రత్యక్ష సరఫరాలు!
న్యూఢిల్లీ: దేశీయంగా కుటుంబాలు ఎల్పీజీకి బదులుగా ఇథనాల్ను వినియోగించడాన్ని ప్రోత్సహించవలసిందిగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ(ఎఫ్ఐపీఐ) కోరుతోంది. వంటకు శుద్ధ ఇంధనంగా ఇథనాల్ను వినియోగించేందుకు అనువైన సాంకేతికతను అభివృద్ధి చేయవలసిందిగా ఆలిండియా డిస్టిల్లరీస్ అసోసియేషన్(ఏఐడీఏ)ను కోరింది. ఎల్పీజీస్థానే బయోఇంధన వినియోగాన్ని విస్తరించడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని పెట్రోలియం పరిశ్రమ అభిప్రాయపడింది.
ఇథనాల్ ఆధారిత వంట స్టవ్లపై రీసెర్చ్ కొనసాగుతున్నట్లు ఏఐడీఏ సదస్సు సందర్భంగా ఎఫ్ఐపీఐ డైరెక్టర్(డౌన్స్ట్రీమ్) ఆర్ఎస్ రవి తెలియజేశారు. ఎల్పీజీ ఎక్విప్మెంట్ రీసెర్చ్ సెంటర్(ఎల్ఈఆర్సీ) తదితర ఏజెన్సీలు, వివిధ ఐఐటీలు ఇథనాల్ ఆధారిత సమర్థవంత కుకింగ్ స్టవ్లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే నమూనా(ప్రొటోటైప్) స్టవ్లు సిద్ధంకానున్నట్లు వెల్లడించారు.
ఇథనాల్తో వంటకు..
వంటకు ఇథనాల్ను ఇంధనంగా వినియోగించుకోగలిగే విషయంలో ఐడీఏసహా.. సంస్థ సభ్యులు రెండు విధాలుగా మద్దతివ్వవలసి ఉన్నట్లు రవి పేర్కొన్నారు. ఇథనాల్ వంట స్టవ్ల ఉత్పత్తిని పెంచేందుకు తయారీదారులకు సహకరించడంతోపాటు.. కుటుంబాలకు ప్రత్యక్షంగా ఇథనాల్ డెలివరీ అయ్యేందుకు సరఫరాల చైన్ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు వివరించారు. ఇథనాల్ సరఫరాల ద్వారా ప్రస్తుతం చమురు పరిశ్రమకు ఇస్తున్న మద్దతు స్థాయిలోకాకుండా ఇందుకు విభిన్నంగా వ్యవహరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.
సరఫరా చైన్ అభివృద్ధి, డెలివరీ అంశాలు కీలకమని, దేశీయంగా ఇథనాల్ను వంట ఇంధనంగా మార్పుచేసేందుకు ఏఐడీఏ ముందుకురావాలని రవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పెట్రోల్లో ఇధనాల్ను 20 శాతం మిక్స్(ఈ20) చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది.
డీజిల్లో కలిపేందుకు వీలైన ఏబీఏ ఉత్పత్తిని పెంచడం, ఇథనాల్ టు సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(ఎస్ఏఎఫ్)కు సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై అభ్యర్థనలతోపాటు.. వంటకు వీలయ్యే ఇథనాల్పై ప్రత్యేక దృష్టిపెట్టవలసిందిగా ఏఐడీఏను రవి కోరారు. బయోఇంధన వ్యవస్థలో వంట ఇంధనాన్ని చేర్చడం ద్వారా ఇంధన భద్రతను పెంచుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు చమురు పరిశ్రమ, డిస్టిల్లరీలు సహకరించుకోవడం ద్వారా దేశీయంగా ఇథనాల్ ఆధారిత వంటకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు.


