ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా ఆ ప్రభావం ఇప్పుడు భారత విభాగంపై కూడా పడనుంది.
కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం, నోకియా తన భారత కార్యకలాపాల్లో కీలక మార్పులు చేపట్టింది. కంపెనీ తన భారత నాయకత్వ బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించింది. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా నియమితులయ్యారు. ఈయనకు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ నియంత్రణ ఇచ్చారు. విభా మెహ్రా, ఇండియా కంట్రీ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరూ 2026 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనుండగా ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు.
ఆదాయంలో భారీ క్షీణత
భారత మార్కెట్లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు (సుమారు రూ.4,290 కోట్లు) పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు 463 మిలియన్ యూరోలుగా (సుమారు రూ.5,000 కోట్లు) నమోదయ్యాయి. అమ్మకాల్లో ఈ క్షీణత వల్ల లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 2023లో జరిగిన మొబైల్ నెట్వర్క్లు, క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన ‘డూప్లికేషన్’ ఉద్యోగాలను తొలగించడంపై దృష్టి సారించింది.
టెలికాం రంగంలో సంక్షోభం?
నోకియా మాత్రమే కాదు దాని ప్రధాన ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా గత ఏడాది దాదాపు 5,000 మందిని తొలగించింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపగా మెటా కూడా 15,000 మంది తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్!


