ఎన్‌ఐఐటీ టెక్‌- ఎడిల్‌వీజ్‌.. షేర్ల జోరు | NIIT Technologies- Edelweiss financial zoom | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐఐటీ టెక్‌- ఎడిల్‌వీజ్‌.. షేర్ల జోరు

Jul 29 2020 12:05 PM | Updated on Jul 29 2020 12:13 PM

NIIT Technologies- Edelweiss financial zoom - Sakshi

ముందురోజు హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 80 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం తక్కువగా రూ. 1057 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 9 శాతం వెనకడుగుతో రూ. 181 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 17.1 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో 18.6 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ఆదాయంలో 7 శాతం వృద్ధిని అందుకోగలమని కంపెనీ అంచనా వేస్తోంది. ఇదే విధంగా మార్జిన్లు 1.5 శాతం బలపడగలవని భావిస్తోంది. సానుకూల గైడెన్స్‌ నేపథ్యంలో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం దూసుకెళ్లి రూ. 1871 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1894 వరకూ ఎగసింది.

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ చేపట్టనున్న పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించి ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, డెలాయిట్‌.. అడ్వయిజర్స్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో లావాదేవీల అడ్వయిజర్‌గా డెలాయట్ తోపాటు..ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ను ఎల్‌ఐసీ ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 78 సమీపంలో ఫ్రీజయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement