న్యూఢిల్లీ: అవీవా ఇండియా ‘అవీవా సెక్యూర్ నెస్ట్ యాన్యూటీ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియంతో స్థిరమైన ఆదాయాన్ని పొందే పరిష్కారమే ఈ ప్లాన్ అని సంస్థ ప్రకటించింది. 80 ఏళ్ల వయసు వరకు ఈ ప్లాన్లోకి ప్రవేశించొచ్చు. ఈ ప్లాన్ కింద ఒకరికి లేదంటే ఉమ్మడిగా కవరేజీని కూడా పొందొచ్చు.
మరణానంతరం నామినీలకు కొనుగోలు ధరను చెల్లించే సదుపాయం కూడా ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్లాన్ పనిచేస్తుందని అవీవా ఇండియా తెలిపింది. జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ద్వారా భరోసా ఇస్తున్నట్టు అవీవా ఇండియా ఎండీ, సీఈవో అసిత్ రథ్ తెలిపారు.
బజాజ్ లైఫ్ ‘యంగ్ అచీవర్ ప్లాన్’
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకునే పిల్లల పేరిట సంపద సృష్టితోపాటు, వారి భవిష్యత్ లక్ష్యాలకు కవరేజీతో కూడిన ‘బజాజ్ లైఫ్ యంగ్ అచీవర్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లల కోసం కావాల్సినంత నిధిని (హామీతో కూడిన) సమకూర్చుకోవచ్చు. తల్లి/తండ్రి మరణిస్తే లేదా వైకల్యం పాలు కావడం లేదంటే ఎంపిక చేసిన 25 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్నెస్) ఏదేనీ బారిన పడితే, ఆ తర్వాత భవిష్యత్ ప్రీమియంలు చెల్లించక్కర్లేదు.
పాలసీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకే విడత చెల్లింపులు లేదా పిల్లల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా క్రమానుగతంగా ఆదాయం అందుకునే ఆప్షన్లలో ఒకదానిని ఎంపిక చేసుకోవచ్చు. 5–12 ఏళ్ల మధ్య ప్రీమియం చెల్లింపుల కాలవ్యవధిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులకు, చివర్లో అందుకునే ప్రయోజనాలపై పన్ను ప్రయోజనాలున్నాయి.


