భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే.. | Mexico Tariff Escalation on india check full details | Sakshi
Sakshi News home page

భారత్‌పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..

Dec 13 2025 8:55 AM | Updated on Dec 13 2025 8:55 AM

Mexico Tariff Escalation on india check full details

అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్స్, వాటి విడిభాగాల తయారీదారులు, ఎంఎస్‌ఎంఈ రంగాలపై దీని ప్రభావం పడనుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మెక్సికో సుంకాల పెంపు

ఇటీవల మెక్సికన్ సెనేట్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న సుంకాల పెంపును ఆమోదించింది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఈ కొత్త విధానం అమలవుతుందని చెప్పింది. ఈ పెంపులో ఆటోమొబైల్స్ దిగుమతి సుంకం కీలకంగా మారింది. కొత్త నిర్ణయాల్లో భాగంగా ఇది 20 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెరుగుతుంది. భారతీయ కార్ల తయారీదారులు, ఆటో విడిభాగాల సరఫరాదారులకు మెక్సికో ప్రధాన వైవిధ్య మార్కెట్‌ల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు 50% సుంకం కారణంగా వారి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి, మెక్సికన్ మార్కెట్‌లో పోటీ పడే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు(అంచనా)

అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు తమ వస్తువులను నేరుగా అమెరికాకు ఎగుమతి చేయకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. ఈ వస్తు మళ్లింపును నిరోధించే లక్ష్యంతో మెక్సికో సుంకాలు పెంచింది.

యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA)ను సమీక్షించబోతున్న నేపథ్యంలో మెక్సికో తన వాణిజ్య విధానాన్ని అమెరికా వైఖరికి దగ్గరగా ఉండేలా  చూసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మెక్సికోకు భారత్ ఎగుమతులు.. ఏ రంగాలు ప్రభావితం?

భారతదేశం నుంచి మెక్సికోకు ఎగుమతయ్యే ప్రధాన అంశాలలో ఆటోమొబైల్స్‌ ఒకటి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రక్కులు, ఇంజిన్ విడిభాగాలు, టైర్లు వంటి ఆటో విడిభాగాల ఎగుమతులు ప్రభావితం కానున్నాయి.

  • కొన్ని రకాల రసాయనాలు, ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు.

  • రంగులు, రంగుల పదార్థాలు (Dyes and Pigments), ఇతర ఆర్గానిక్ రసాయనాలు.

  • రెడీమేడ్ దుస్తులు, ఇతర వస్త్ర ఉత్పత్తులు.

  • పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు.

భారత్‌కు మెక్సికో దిగుమతులు ఇలా..

మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో చమురు అత్యంత కీలకం. చమురు ధరల్లో పెరుగుదల లేదా లభ్యతలో హెచ్చుతగ్గులు భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రవాణా, తయారీ రంగాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.

యంత్రాలు, విడిభాగాలు

తయారీ, ఇంజినీరింగ్ రంగానికి సంబంధించిన భారీ పారిశ్రామిక యంత్రాలు, టర్బైన్లు, పంపింగ్ పరికరాలు వంటి వాటిని భారత్ మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది.

బంగారం, వెండి

విలువైన లోహాల రంగంలో భారత్ బంగారం, వెండి లోహాలను (కొన్ని సందర్భాలలో) దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో బంగారం వినియోగం అత్యధికంగా ఉంటుంది.

ఖనిజాలు

మైనింగ్ రంగంలో కొన్ని రకాల లోహ ఖనిజాలు, ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది.

మెక్సికో సుంకాల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా ఉన్నప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి కీలకమైన వస్తువులపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాలో కూడా అనిశ్చితి ఏర్పడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలంటే..

  • సుంకాల నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఎగుమతిదారులు లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలు, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించాల్సి ఉంది.

  • లాటిన్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల (ప్రైమరీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌) కోసం చర్చలను వేగవంతం చేయాలి. ఇది సుంకాల భారం లేకుండా మార్కెట్ అవకాశాన్ని సులభతరం చేస్తుంది.

  • దేశీయంగా తయారీ రంగాన్ని ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచాలి.

ఇదీ చదవండి: భారత్‌లో పెరుగుతున్న ‘ఘోస్ట్‌ మాల్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement