విదేశీ ప్రయాణాలను తగ్గించుకోండి
ఉద్యోగులకు మారుతీ సుజుకీ సూచన
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు పిలుపునకు స్పందనగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. వీలైన చోట్ల వర్క్ ఫ్రం హోమ్ విధానాలను అమలు చేయడంతో పాటు విదేశీ ప్రయాణాలను తగ్గించడంలాంటివి వీటిలో ఉన్నాయని సోషల్ మీడియా ప్లాట్ఫాం ఎక్స్లో పేర్కొంది.
సంక్షోభంలోనైనా, సాధారణ పరిస్థితుల్లోనైనా వీలైనంత వరకు పెట్రోలియం ఉత్పత్తులు, విదేశీ కరెన్సీ వినియోగాన్ని తగ్గించుకుని, వ్యాపారాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించాలనేది తమ సిద్ధాంతమని వివరించింది. ప్రక్రియలను పున:సమీక్షించుకునేందుకు, వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇంధన వినియోగంపరమైన ప్రయాణాలను తగ్గించేందుకు వీలైన సందర్భాల్లో ఇంటి నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచించినట్లు పేర్కొంది.
వ్యాపార రీత్యా అత్యంత అవసరమైతే తప్ప, విదేశీ ప్రయాణాలను సాధ్యమైనంత వరకు మానుకోవాలని ఆదేశాలిచ్చినట్లు వివరించింది. వర్చువల్ మీటింగ్లను ఎంచుకోవడం ద్వారా దేశీయంగా ప్రయాణాలను తగ్గించుకోవాలని సిబ్బందికి కంపెనీ సూచించింది. ప్రయాణాల కోసం కూడా కార్ పూలింగ్, ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించాలని తెలిపింది. ఇక ఆఫీసులు, ఇళ్లల్లోను ఏసీలు, ఫ్యాన్లు, లైట్లను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా విద్యుత్తును కూడా ఆదా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటు ఉద్యోగులకు, అటు వ్యాపార భాగస్వాములకూ సూచించినట్లు కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు


