ధరలు, తయారీ గణాంకాల ఎఫెక్ట్
పాలసీ నిర్ణయాలే ట్రెండ్కు చుక్కాని
పశ్చిమాసియా పరిస్థితులూ కీలకమే
మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనా
నేడు(6న) కేంద్ర బ్యాంకు పరపతి సమీక్షా సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణికి కట్టుబడే వీలుంది. ఓవైపు ద్రవ్యోల్బణం బలపడుతుంటే.. మరోపక్క తయారీ రంగం డీలా పడుతోంది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లో ట్రెండ్కు పాలసీ నిర్ణయాలు చుక్కానిగా నిలిచే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా ముడిచమురు ధరలు మండుతుండటం దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారి చూపుతోంది. ఇప్పటికే దేశీ చమురు అవసరాల కోసం 75 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధాపడుతుండటంతో వాణిజ్య లోటు పెరగనుంది. ఈ ఆందోళనలు డాలరుతో మారకంలో రూపాయిని సైతం దెబ్బతీస్తున్నాయి.
అయితే ఆర్బీఐ పటిష్ట చర్యలకు ఉపక్రమించడంతో వారాంతన రూపాయి ఒక్కసారిగా 2 శాతం పుంజుకుని 95 నుంచి 93కు చేరింది. కాగా.. లండన్, యూఎస్ మార్కెట్లలో చమురు పీపా ధర గత శుక్రవారం 110 డాలర్లకు చేరడం దేశీయంగా ధరలను ఎగదోయనుంది. తయారీ పీంఎఐ నాలుగేళ్ల కనిష్టానికి చేరగా.. టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం బలపడుతోంది. దీంతో పాలసీ సమీక్షలో భాగంగా ఆర్బీఐ బుధవారం(8న) కఠిన విధానాలవైపు మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆటుపోట్లకు చాన్స్
ఇప్పటికే యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన సంకేతాలు ఇవ్వగా.. దేశీయంగా ఆర్బీఐ అంచనాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2026–27)లో ధరలు, వృద్ధిని బ్యాలన్స్ చేసేందుకు కేంద్ర బ్యాంకులు అవలంబించనున్న విధానాలపట్ల ఆర్థికవేత్తలు ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు.
ఫెడ్ వడ్డీ పెంపువైపు చూపు సారిస్తే డాలరు బలపడటానికితోడు.. వర్ధమాన మార్కెట్లలో పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నాయిర్ ప్రస్తావించారు. మరోపక్క పశ్చిమాసియా యుద్ధం ముదురుతుండటంతో మరోసారి దేశీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు.
సాంకేతికంగా..
గత వారం 22,200 పాయింట్ల వద్ద మద్దతు తీసుకున్న నిఫ్టీ బలం పుంజుకుంది. ఈ వారం 23,000 స్థాయిని అధిగమిస్తే 23,400–23,500కు చేరవచ్చు. ఇలాకాకుండా 22,000కు బలహీనపడితే మరింత దిగువకు అంటే 21,800–21,700ను తాకే వీలుంది. సెన్సెక్స్ బలహీనపడితే 72,800 వద్ద మద్దతు లభించవచ్చు. ఇలాకాకుంటే తదుపరి 72,000 వరకూ నీరసించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 75,000వరకూ పురోగమించే అవకాశముంది.
ఎఫ్పీఐల భారీ షాక్...
గత ఐదు వారాలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) దేశీ స్టాక్ మార్కెట్లకు భారీ అమ్మకాలతో షాకిస్తున్నారు. ఈ నెల తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 19,837 కోట్ల(2.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మార్చిలోనూ రూ. 1.17 లక్షల కోట్ల(12.7 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించగా.. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంకాగా.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఎఫ్పీఐలు మార్చిలో అమ్మకాల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 1.5 లక్షల కోట్ల విలువైన దేశీ స్టాక్స్ విక్రయించారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


