
సాధారణంగా ఐటీ ఉద్యోగులకు అధిక జీతాలు ఉంటాయని, ఏటా జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ అదంతా ఫేక్ అంటున్నారు చార్టెడ్ అకౌంటెంట్ (సీఎ), క్రియేట్ హెచ్క్యూ ఫౌండర్ మీనాల్ గోయెల్. 8 శాతం జీతం పెరుగుతోందంటే మంచి పెంపు అనుకుంటారని, కానీ ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మీ ఖర్చులను 12% పెంచిందని మీరు గ్రహించాక అసలు సంగతి అర్థమవుతుందంటున్నారు.
జీతాలు, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అధికమవుతున్న అసమతుల్యతను గోయెల్ ఇటీవలి తన లింక్డ్ఇన్ పోస్టులో హైలైట్ చేశారు. ఆమె ఐటీ రంగాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ అసమతుల్యతను ఎత్తి చూపారు. ఇక్కడ ఎంట్రీ లెవల్ వేతనం 2012లో రూ. 3 లక్షల నుండి 2022 నాటికి కేవలం 3.6 లక్షల రూపాయలు అయింది. అంటే ఒక దశాబ్ద కాలంలో ఏ మేరకు కదిలిందో అర్థం చేసుకోవచ్చు. అదే కంపెనీల సీఈవోల జీతాలు మాత్రం అనేక రెట్లు ఎగిశాయి.
"నేటికి, చాలా మంది ఐటీ ఉద్యోగులు సింగిల్-డిజిట్ పెంపు గురించి మాట్లాడుతుండగా, వారి అద్దె, కిరాణా సామగ్రి, జీవనశైలి ఖర్చులు రెండంకెలలో పెరుగుతున్నాయి" అని గోయెల్ రాసుకొచ్చారు. ఆదాయాలు, ఖర్చుల కంటే వెనుకబడి ఉండటంతో, చాలా మంది స్థిరత్వం కోసం బంగారం వంటి ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.
చారిత్రాత్మకంగా, బంగారం ద్రవ్యోల్బణాన్ని ఓడించడమే కాకుండా అనిశ్చితి సమయాల్లో రక్షణను కూడా అందించింది. భారతదేశంలో, దాని ధర గత దశాబ్దంలో దాదాపు రెట్టింపు అయింది. ఓ మధ్య-స్థాయి ఐటీ ఉద్యోగి జీతం పెరుగుదలను అధిగమించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడి ఇకపై లగ్జరీ కాదని గోయెల్ నొక్కి చెప్పారు. "మీరు సంపాదించే ఆదాయం, ఖర్చుల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడానికి పెట్టుబడులు మాత్రమే మార్గం" అని ఆమె చెప్పారు.
ఇదీ చదవండి: ఫోన్పే, పేటీఎంలో ఇక రెంటు కట్టడం కష్టం!