బాలీవుడ్ స్టార్ జంట అజయ్ దేవగన్, కాజోల్ నివసించే ముంబై జుహూలోని లగ్జరీ బంగ్లా ‘శివశక్తి’ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ రాజప్రసాదం ఆధునిక శైలికి, సాంప్రదాయ డిజైన్లకు ప్రతీకగా నిలుస్తుంది. నటి కాజోల్ తన ఇంట్లోని మెట్లమార్గం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ ఇంట్లోని ఇంటీరియర్ ప్రత్యేకతలపై మీడియాలో మళ్లీ ఆసక్తి నెలకొంది.
ఇంటీరియర్స్, ఆర్కిటెక్చర్ అంశాలు..
ఈ బంగ్లాలో ప్రధాన ఆకర్షణ చెక్కతో రూపొందించిన విశాలమైన మెట్లమార్గం. దీనికి అనుబంధంగా పైకప్పు నుంచి నీటి బిందువుల తరహాలో వేలాడే వెలుగుల శ్రేణి ఫోటోషూట్లకు సరైన బ్యాక్డ్రాప్గా మారింది.
మొదటి అంతస్తులోని లాబీ మెరిసే తెల్లటి మార్బుల్ ఫ్లోరింగ్తో నిర్మించారు. సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు ఉన్న పెద్ద గ్లాస్ విండోస్ సహజమైన వెలుతురును ఇంటికి అందిస్తాయి.
లివింగ్ రూమ్లో ఐవరీ సోఫాలు, ఆరు సీట్ల డైనింగ్ టేబుల్ లగ్జరీ లుక్ను ఇస్తాయి.
మినిమలిస్టిక్ థీమ్కు భిన్నంగా రెడ్ లెదర్ సోఫాలతో కూడిన లాంజ్ ఏరియా కుటుంబ సభ్యుల కలయికలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది.
ఆధ్యాత్మికతకు, వ్యక్తిగత అభిరుచులకు అద్దం పట్టేలా నిర్మించిన ఈ నివాసం సెలబ్రిటీ హోమ్ల్లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది.
ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే..


