సంస్కరణలను అందిపుచ్చుకోండి..  | Industries should not hesitate to invest, expand capacities says FM Nirmala Sitharaman | Sakshi
Sakshi News home page

సంస్కరణలను అందిపుచ్చుకోండి.. 

Sep 19 2025 5:07 AM | Updated on Sep 19 2025 8:07 AM

Industries should not hesitate to invest, expand capacities says FM Nirmala Sitharaman

మరింతగా పెట్టుబడులు పెట్టండి 

ప్రభుత్వంతో కలిసి పని చేయండి 

కార్పొరేట్లకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు, సామర్థ్యాలను పెంచుకునేందుకు సందేహించకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. 

బడ్జెట్‌ ముందు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా, ఎప్పుడైనా సరే ప్రభుత్వంతో మాట్లాడాలని ఇండియన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (ఐఎఫ్‌క్యూఎం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనే టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థిరంగా ముందుకెళ్తోందని వివరించారు. 

వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా తగు పాలసీలను రూపొందించడం, పన్నులపరమైన ప్రయోజనాలివ్వడం, మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు అవకాశాలు కల్పించడం తదితర చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల అమలుకు ఎన్నడూ వెనుకాడలేదని, పరిశ్రమ విజ్ఞప్తులను వింటూనే ఉన్నారని ఆమె తెలిపారు. 

‘మరింతగా ఇన్వెస్ట్‌ చేయడం, సామర్థ్యాలను పెంచుకోవడం, భారత్‌లో మరింతగా ఉత్పత్తి చేయడంపై ఇక మీదట సందేహాలు ఉండబోవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) చిన్న పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కీలకంగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు. వాటి అవసరాలను గుర్తించే, ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లలో స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (సిడ్బి) ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.  

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆవశ్యకత.. 
అధిక వృద్ధి సాధన దిశగా, ఎకానమీకి దన్నుగా చర్యలు తీసుకునే క్రమంలో కేంద్రం 2025–26లో రూ. 11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాలను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అయితే, సామర్థ్యాల పెంచుకోవాలంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రైవేట్‌ పెట్టుబడులు అంతగా రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) శాఖ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ పెట్టుబడులు 26 శాతం తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ కంపెనీలు వరుసగా రూ. 3.95 లక్షల కోట్లు, రూ. 5.72 లక్షల కోట్లు, రూ 4.22 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి.  

అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. 
దేశీయ మార్కెట్లోనూ, ఎగుమతులపరంగానూ ప్రభుత్వం చక్కని అవకాశాలు కల్పిస్తోందని చంద్రశేఖరన్‌ చెప్పారు. మరింత మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, చిన్న..మధ్యతరహా సంస్థలు, పెద్ద కార్పొరేట్లు గణనీయంగా ఇన్వెస్ట్‌ చేస్తాయని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు వివరించారు. సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునేలా ప్రపంచం ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేíÙస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని ఆయన పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement