దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం క్రితం రోజు లాభాలను నిలబెట్టుకోలేక స్వల్ప నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 24,055 పాయింట్ల వద్ద స్థిరపడగా, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 12 పాయింట్లు పడిపోయి 76,944 వద్ద నిలిచింది. దేశీయంగా ఇటీవలి జీడీపీ గణాంకాలు బలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి.
నష్టాలకు దారితీసిన కొన్ని అంశాలు
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో మళ్లీ భౌగోళిక ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. చమురు ధరలు పెరగడం భారతదేశం లాంటి దిగుమతి ఆధారిత దేశాల ద్రవ్యోల్బణానికి సవాలుగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది.
అమెరికా బాండ్ ఈల్డ్లు పెరగడం, అక్కడి వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగుతాయనే అంచనాలు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణకు దారితీశాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
రక్షణాత్మక రంగాల్లో కొనుగోళ్లు
మార్కెట్లు తీవ్ర ప్రతికూలతల్లో ఉన్నప్పటికీ రక్షణాత్మక రంగాలుగా భావించే ఎఫ్ఎమ్సీజీ, ఐటీ విభాగాలు సూచీలకు ఆసరాగా నిలిచాయి. ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ముగిసి నష్టాల తీవ్రతను పరిమితం చేశాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం స్వల్పకాలంలో విదేశీ మార్కెట్ల సంకేతాలు, అంతర్జాతీయ చమురు ధరల గమనం ఆధారంగానే ఇండియన్ మార్కెట్లు ముందుకు సాగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!


