ఐటీ కంపెనీలు ‘వార్న్‌’ నోటీసులు.. ఇచ్చాయంటే.. | Indian IT companies to cut US jobs WARN notices | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీలు ‘వార్న్‌’ నోటీసులు.. ఇచ్చాయంటే..

Apr 9 2026 11:21 AM | Updated on Apr 9 2026 11:42 AM

Indian IT companies to cut US jobs WARN notices

అంతర్జాతీయ ఐటీ రంగంలో మళ్లీ కుదుపు మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నాయి. కృత్రిమ మేధ (AI) వినియోగం పెరగడం, క్లయింట్ల నుంచి వ్యయ నియంత్రణ ఒత్తిడి ఎక్కువవ్వడంతో ఆన్‌సైట్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

ఏమిటీ ‘వార్న్‌’ నోటీసులు?
అమెరికా చట్టాల ప్రకారం.. 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు, ఒకేసారి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించాలన్నా లేదా కార్యాలయాన్ని మూసివేయాలన్నా 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలి. దీనినే 'వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్' (WARN) అంటారు. తాజాగా భారతీయ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో దాఖలు చేస్తున్న ఈ నోటీసులు ఐటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

2026లో పెరిగిన కోతలు: గణాంకాలను పరిశీలిస్తే, 2025 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2026 తొలి మూడు నెలల్లోనే అత్యధికంగా ఉద్యోగాల తొలగింపులు జరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.

పెద్ద ఒప్పందాల ప్రభావం: గతంలో కుదుర్చుకున్న 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన భారీ ఒప్పందాల పునర్నిర్మాణం (Restructuring) వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

ముందు వరుసలో దిగ్గజాలు: జనవరి-మార్చి మధ్య కాలంలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందూజా గ్లోబల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో వార్న్ నోటీసులు ఇచ్చాయి.

గత ఏడాది పరిస్థితి: 2024లో జెన్‌పాక్ట్, హెచ్‌సీఎల్, టీసీఎస్ వంటి సంస్థలు కేవలం నాలుగు నోటీసులు మాత్రమే ఇవ్వగా, 2025లో జెన్‌పాక్ట్ విస్కాన్సిన్‌లో నోటీసులు జారీ చేసింది. కానీ, ప్రస్తుత ఏడాదిలో ఈ ధోరణి వేగవంతమైంది.

ఏఐ, క్లయింట్ల ఒత్తిడి
సాంకేతికత మారుతున్న కొద్దీ కంపెనీలు పాత పద్ధతులకు స్వస్తి పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్వీకరణ పెరగడంతో, క్లయింట్లు తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల ఆన్‌సైట్‌లో ఉన్న ఉద్యోగులను తగ్గించుకోవడం లేదా రీస్ట్రక్చరింగ్ చేయడం కంపెనీలకు తప్పనిసరి అవుతోంది.

తొలగింపులే కాకపోవచ్చు
అన్ని వార్న్ నోటీసులు నేరుగా ఉద్యోగ తొలగింపులే కాకపోవచ్చు. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ BPM విభాగం 248 మంది ఉద్యోగుల కోసం నోటీసు ఇచ్చింది. అయితే వీరు ఇన్ఫోసిస్ క్లయింట్ అయిన 'వాన్‌గార్డ్' సంస్థకు తిరిగి వెళ్తున్నట్లు వెల్లడైంది.

మరోవైపు, టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించగా, అందులో భారత్‌కు చెందిన 10,000 మంది ఉండటం గమనార్హం. తెల్లవారుజామున ఈమెయిల్స్ ద్వారా ఉద్యోగులకు సమాచారం పంపుతూ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement