
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
జీరో-డ్యూటీ యాక్సెస్
బాస్మతి, బాస్మతియేతర బియ్యం
పండ్లు మరియు కూరగాయలు
మసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)
ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)
సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)
పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.
గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.
ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?
వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు.