ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ సవాళ్లు  | India shows resilience amid West Asia conflict | Sakshi
Sakshi News home page

ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ సవాళ్లు 

May 31 2026 5:56 AM | Updated on May 31 2026 5:56 AM

India shows resilience amid West Asia conflict

బలహీన రుతుపవనాలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావం 

వృద్ధి మందగమన సంకేతాలు, డిమాండ్‌పై ఆందోళన 

దేశీయ ఆర్థిక వ్యవస్థ పునాదులు మాత్రం పటిష్టం 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీ సమీక్షలో వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడొచ్చనే అంచనాలు, ఆర్థిక కార్యకలాపాల వేగం మందగించే సంకేతాల నేపథ్యంలో రాబోయే నెలల్లో వినియోగ డిమాండ్‌ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అయినప్పటికీ ప్రతికూల పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ‘అప్రమత్తమైన స్థితిస్థాపకత’ను ప్రదర్శిస్తోందని శనివారం విడుదల చేసిన ‘నెలవారీ ఆర్థిక సమీక్ష’ నివేదికలో పేర్కొంది.

 ‘‘దేశీయంగా తయారీ, సేవల రంగాలు నిలకడగా రాణిస్తుండగా, ఉద్యోగ మార్కెట్‌ కూడా స్థిరంగా ఉంది. వీటికి తోడు విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్‌ నిల్వలు) అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధిలో నెలకొన్న అంతరాయాలు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపైనే భారత్‌ విదేశీ వాణిజ్యం, ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంది’’ అని ఆర్థిక శాఖ నివేదికలో వెల్లడించింది. 

ద్రవ్యోల్బణంపై అప్రమత్తత అవసరం 
ఇటీవల పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ప్రత్యక్షంగా, పరోక్షంగా మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. టోకు ధరలు, రిటైల్‌ ద్రవ్యోల్బణం మధ్య ప్రస్తుతం కనిపిస్తున్న వ్యత్యాసం ఉత్పత్తి వ్యయాల ఒత్తిడి క్రమంగా పెరుగుతోందనే సంకేతాలను ఇస్తోందని పేర్కొంది. ఇప్పటివరకు ఈ ప్రభావం వినియోగదారుల స్థాయికి పరిమితంగానే చేరినప్పటికీ, త్వరలోనే ధరల రూపంలో ప్రతిఫలించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ఇంధన వ్యయాల ప్రభావానికి తోడు ఆహార ధరలపైనా అదనపు ఒత్తిడి ఏర్పడవచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 

వృద్ధి కొనసాగుతున్నా, హెచ్చరిక సంకేతాలు 
ఏప్రిల్‌లో ఈ–వే బిల్లుల జనరేషన్, పీఎంఐ సూచీలు, విద్యుత్‌ వినియోగం తదితర అంశాలు వృద్ధిని సూచిస్తున్నాయి. అయితే ఎనిమిది కీలక పరిశ్రమల సూచీ, ఇంధన వినియోగంలో కనిపిస్తున్న మందగమనం ఆందోళన కలిగిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై క్రమంగా ప్రభావం చూపుతున్నాయనడానికి ఇవి సంకేతాలని పేర్కొంది. 

విధానపరమైన సరళత్వం అవసరం 
ప్రపంచ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో ద్రవ్య, ఆర్థిక, నిర్మాణాత్మక విధానాల్లో సమయోచిత సరళత్వం అవసరమని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల, రూపాయి బలహీనత, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, బలహీన రుతుపవనాల అవకాశం వంటి అంశాలపై నిరంతర అప్రమత్తత అవసరమని స్పష్టం చేసింది. వృద్ధి వేగాన్ని కాపాడుకుంటూనే, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు విధానపరమైన అప్రమత్తతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

ముంచుకొస్తున్న ముప్పు 
పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక రికవరీకి ప్రధాన అడ్డంకిగా మారిందని నివేదిక పేర్కొంది. దీనివల్ల క్రూడాయిల్‌ ధరలు పెరగడం, రవాణా, లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరగడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచుతున్నాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ (అధిక ద్రవ్యోల్బణం–తక్కువ వృద్ధి) ఆందోళనలు తిరిగి తలెత్తుతున్నాయి. ప్రధాన దేశాల కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధానాలను గత అంచనాల కంటే ఎక్కువ కాలం కొనసాగించే అవకాశముంది. క్రూడాయిల్‌ ధరల పెరుగుదల, కఠినతరమవుతున్న ఆర్థిక పరిస్థితులు, ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగించడం వంటి అంశాలు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక శాఖ నివేదికలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement