న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం గత నెల(మే)లో ఆరు నెలల గరిష్టానికి చేరింది. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త క్లయింట్లను పొందడం, కొత్త బిజినెస్ల వినియోగంలో పురోగతి ఇందుకు సహకరించాయి. వెరసి బుధవారం విడుదలైన నెలవారీ సర్వేలో హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.8కు బలపడింది. ఏప్రిల్లో ఇది 58.8గా నమోదుకాగా.. గత నవంబర్ తదుపరి మే నెలలో సర్వీసులు బలంగా పుంజుకున్నాయి.
పీఎంఐగా పిలిచే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50ను దాటితే సర్వీసుల రంగం విస్తరించినట్లు లెక్క. 50కు దిగువన నమోదైతే క్షీణతను చవిచూస్తున్నట్లు తెలియజేస్తుంది. ప్రధానంగా రవాణా, డిజిటల్ సొల్యూషన్లు, ఈకామర్స్, ఎంటర్టైన్మెంట్, ఐటీ విభాగాలలో సర్వీసులకు పెరిగిన డిమాండ్ కొత్త బిజినెస్ల వృద్ధికి దోహదపడింది. దీంతో కంపెనీలలో యాక్టివిటీ పుంజుకోవడంతోపాటు.. ఉపాధి కల్పనకు బూస్ట్ లభించింది.


