‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’ గా భారత్‌ | India Pharmaceuticals in Global Healthcare | Sakshi
Sakshi News home page

‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’ గా భారత్‌

Mar 22 2026 5:45 AM | Updated on Mar 22 2026 5:45 AM

India Pharmaceuticals in Global Healthcare

ప్రపంచ ఆరోగ్య రంగంలో భారత్‌ ఔషధ శక్తి 

దేశీయ ఉత్పత్తి నుంచి గ్లోబల్‌ మార్కెట్ల వరకు విస్తరణ 

ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలక పాత్ర 

తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు 

ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో దేశానిది ప్రత్యేక స్థానం 

ఔషధ పరిశ్రమ, దేశీయ ఉత్పత్తి, సామర్థ్యంపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ‘‘ఫార్మసీ ఆఫ్‌ ది వరల్డ్‌’ ’గా పేరొందిన భారత్‌ ఔషధ పరిశ్రమ... దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్‌కి ప్రత్యేక స్థానమని హర్షం వ్యక్తం చేసింది. 

ఇటీవల కాలంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న విధానంపై ‘ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో’(పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రంగానికి, ఆర్థికాభివృద్ధికి అనుసంధానకర్త ‘ఫార్మాస్యూటికల్‌’ రంగం కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది. అవసరమైన మందులు, టీకాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, సప్లై చైన్‌ బలోపేతం, సామాజికాభివృద్ధికి ఈ రంగం తోడ్పడుతున్నట్లు వివరించింది. 

ప్రపంచ ఫార్మా మార్కెట్లో భారత్‌ది ప్రత్యేక స్థానం: భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో వాల్యూమ్‌(పరిమాణం) పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానంలో ఉందని పీఐబీ తెలిపింది. దేశంలో 3 వేలకు పైగా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన దేశీయ మార్కెట్‌ 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. భారత్‌ ప్రపంచంలో జనరిక్‌ మందుల అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుంది. ప్రపంచ సరఫరాలో దాదాపు 20శాతం వాటా భారత్‌దే కావడం గమనార్హం. సుమారు 60వేల జనరిక్‌ బ్రాండ్లు 60 చికిత్స విభాగాల్లో ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. 

అంతర్జాతీయ నమ్మకం, నాణ్యతకు గుర్తింపు: అమెరికా వెలుపల అత్యధికంగా యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. సుమారు 500 ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రేడియంట్స్‌)తయారీ సంస్థలు ఉండటం ద్వారా ప్రపంచ ఏపీఐ మార్కెట్లో భారత్‌కు ఎనిమిది శాతం వాటా ఉంది. ఇక ఎగుమతుల్లోనూ భారత్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్‌ డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్‌ (డీపీటీ), బీసీజీ మీజిల్స్‌ టీకాల సరఫరాలో ప్రథమ స్థానంలో ఉంది. యూనిసెఫ్‌కు 60% టీకాలను భారత్‌ సరఫరా చేస్తుండటం గరి్వందచదగ్గ విషయంగా పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ మీజిల్స్‌ టీకా అవసరాల్లో 90% భారత్‌ నుంచే సరఫరా అవుతోంది. ఇక 2024–25లో ఔషధ ఎగుమతులు 30.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం భారత్‌ 191 దేశాలకు ఔషధాలు ఎగుమతి 
చేస్తున్నట్లు వివరించింది.

ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు
ఫార్మా రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానంగా.. ‘పీఎల్‌ఐ పథకం’. ఈ పథకం ప్రభావం రూ.3.16 లక్షల కోట్ల అమ్మకాలు, రూ.2.03 లక్షల కోట్ల ఎగుమతులు, సుమారు 97వేల ఉద్యోగాలు, బల్క్‌ డ్రగ్‌ – మెడికల్‌ డివైస్‌ పార్కులు అని వివరించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్కులు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో మెడికల్‌ డివైస్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ‘ప్రధాన్‌ మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద దేశవ్యాప్తంగా 18,600కి పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. 

తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ ప్రజల ఖర్చులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘ఇన్నోవేషన్, పరిశోధన’కు కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపింది. ఈపథకం కింద పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. 111 పరిశోధన ప్రాజెక్టులు, పేటెంట్లు నమోదు కావడం ఈ రంగం పురోగతిని సూచిస్తుందన్నారు. 2026–27 బడ్జెట్‌లో ‘‘బయోఫార్మా శక్తి’’ పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్‌ ఉత్పత్తిలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇండియన్‌ ఫార్మాకోపియా కమిషన్‌ వంటి సంస్థలు ఔషధాల నాణ్యత, ధరలు, భద్రతపై కట్టుదిట్టమైన నియంత్రణ నిర్వహిస్తున్నట్లు పీఐబీ వివరించింది.

కొత్త మార్కెట్లలో విస్తరణ: నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు పెంచుతూ భారత్‌ తన మార్కెట్‌ను విస్తరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తుందని పీఐబీ పేర్కొంది. ఇక విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్‌ వరకు రూ.13,193 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇక వాణిజ్య ఒప్పందాలతో భారత్‌ గ్లోబల్‌గా విస్తరిస్తోంది. యూరోపియన్‌ యూనియన్, యూనైటెడ్‌ కింగ్‌డమ్, న్యూజిలాండ్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఔషధ రంగానికి కొత్త అవకాశాలు తెరిచాయి. టారిఫ్‌ తగ్గింపులతో ఎగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా యూకే మార్కెట్లో భారత జనరిక్‌ మందులకు మరింత పోటీ సామర్థ్యం లభించనున్నట్లు పీఐబీ పేర్కొంది.    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement