
దేశంలోని తొలి ప్రైవేటు హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలార్లో ఏర్పాటు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఊతమిచ్చేలా టాటా గ్రూప్-ఎయిర్ బస్లు కలిసి హెచ్ 125 సివిల్ హెలికాప్టర్లను తయారు చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి తయారీ యూనిట్ ఇది నాలుగోది కావడం విశేషం.
కర్ణాటకలోని వేంగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో దేశంలోనే తొలి ప్రైవేట్ సెక్టార్ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ఫెసిలిటీ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ కేంద్రం ద్వారా ఏటా 10 ఎయిర్ బస్ హెచ్ 125 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తామని చెప్పాయి. వచ్చే 20 ఏళ్లలో 500 యూనిట్ల ప్రాంతీయ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేస్తున్నాయి. టీఏఎస్ఎల్, ఎయిర్ బస్ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్లాంట్ దేశీయ ఏరోస్పేస్ తయారీ రంగంలో స్వావలంబనను పెంపొందించేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: టర్కీ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేసిన చెన్నై ఎయిర్పోర్ట్
ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, ప్రస్తుతం ఉన్న టీఏఎస్ఎల్ మౌలికసదుపాయాలు, భూ సేకరణ, ఫాస్ట్ట్రాక్ అనుమతులు, ఉత్పత్తి సంబంధిత ప్రయోజనాలు వంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా కర్ణాటక ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. హెలికాప్టర్ అసెంబ్లింగ్, తయారీ, నిర్వహణ, మరమ్మతులు ఇతర కార్యకలాపాల కోసం టీఏఎస్ఎల్ 7,40,000 చదరపు అడుగుల స్థలాన్ని సేకరించింది.