బ్యాంకుల్లో మొండి బకాయిలు, తగ్గుతున్నాయట | Icra Said Overdue Loans Could Spike Fresh Slippages In 2021-2022 | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లో మొండి బకాయిలు, తగ్గుతున్నాయట

Jul 8 2021 1:20 AM | Updated on Jul 8 2021 4:06 AM

Icra Said Overdue Loans Could Spike Fresh Slippages In 2021-2022 - Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ మొండి బకాయిల (ఎన్‌పీఏ) తీవ్రత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తగ్గుతుందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా బుధవారం పేర్కొంది.  2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ)లు మొత్తం రుణాల్లో 7.6 శాతం ఉంటే, ఈ రేటు 2021–22 మార్చి ముగిసే నాటికి 7.1 శాతానికి దిగివస్తాయని అంచనావేసింది.  అధిక రికవరీలు, రుణ పునర్‌వ్యవస్థీకరణలు, వేగవంతమైన రుణ వృద్ధి ఇందుకు దోహదపడే ప్రధాన అంశాలని తన తాజా నివేదికలో పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 
 
♦ 
స్థూల మొండిబకాయిలు 6.9 శాతం నుంచి 7.1 శాతం శ్రేణిలో ఉంటాయని భావిస్తున్నాం. నికరంగా ఈ శ్రేణి 1.9 శాతం 2 శాతం శ్రేణిలో ఉంటుందని అంచనా. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జీఎన్‌పీఏల అంచనాలతో పోల్చితే (9.8 శాతం) తాజా ఇక్రా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం.  

కేవలం కొత్త పద్దులకు సంబంధించి ఎన్‌పీఏలు 2019–20లో రూ.3.7 లక్షల కోట్లు. రుణాల్లో ఇది 4.2 శాతం. 2020–21లో ఈ పరిమాణం రూ.2.6 లక్షల కోట్లు. రుణాల్లో 2.7 శాతం. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఎన్‌పీఏలు పెరిగే అవకాశం ఉంది. మారటోరియం వంటి రెగ్యులేటరీ వెసులుబాట్లు ఏమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లేకపోవడం దీనికి కారణం.  

కోవిడ్‌–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొంటున్న రుణగ్రహీతల ఆదాయం, ద్రవ్యలభ్యత సంబంధిత ఒత్తిడులు 2021–22 ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ బ్యాలెన్స్‌ షీట్లలో ప్రతిబింబించవు. లిక్విడిటీ, నియంత్రణ, సరళీకరణ విధానాలు, అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) వంటి  కేంద్రం, ఆర్‌బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. రుణాలకు సంబంధించి కేటాయింపులు (క్రెడిట్‌ ప్రొవిజన్స్‌) 2019–20లో 3.7 శాతం. 2020–21లో ఈ రేటు 2.5 శాతానికి తగ్గింది.
  
 బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యేకించి ప్రభుత్వ రంగానికి సంబంధించి పరిస్థితి మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఐదు సంవత్సరాల తర్వాత 2020–21లో  బ్యాంకులు లాభాలను చూశాయి. అలాగే నికర ఎన్‌పీఏలు గడచిన ఆరేళ్లలో అతి తక్కువ స్థాయిలో 3.1 శాతంగా నమోదయ్యాయి.  మున్ముందు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ లాభాలతో కొనసాగే అవకాశాలే ఉన్నాయి.  

ఎన్‌పీఏల పరిస్థితి మెరుగుపడ్డంతోపాటు మూలధనం పెంపు చర్యలు కూడా సత్ఫలితాలను ఇస్తుండడం హర్షణీయం. బ్యాంకింగ్‌ రంగం వృద్ధి, పురోగతి, లాభదాయకతకు ఆయా అంశాలు మద్దతును ఇస్తున్నాయి.  

ఈ నేపథ్యంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సవాళ్లను బ్యాంకింగ్‌ పటిష్టంగా ఎదుర్కొన్నట్లు ఇక్రా విశ్వసిస్తోంది. దీనితో బ్యాంకింగ్‌ రంగానికి ఇక్రా ‘స్టేబుల్‌’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement