సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది వారి కష్టార్జితం లేదా బ్యాంకు రుణాల ద్వారా పొందిన సొమ్ము అయి ఉండాలి. కానీ, కొందరు నేరస్థులు డ్రగ్స్ రవాణా, అవినీతి లేదా ఇతర అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెడుతుంటారు.
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుడికి చెందిన కోటి రూపాయల విలువైన ఇంటిని అధికారులు సీజ్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, అక్రమ సంపాదనతో ఇళ్లు నిర్మిస్తే ఎదురయ్యే పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రత్యేక కథనం.
ఆ ఇల్లు ఏ డబ్బుతో కట్టారు?
నాగౌర్ కేసులో నిందితుడు గోవింద్ రామ్ అలియాస్ గోవింద్ జాట్, అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సంపాదించిన డబ్బుతో తన నివాసాన్ని నిర్మించాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) యాక్ట్ ప్రకారం, ఇలాంటి మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా అక్రమమైనది. పోలీసులు జరిపిన విచారణలో, సదరు నిందితుడు తన నేరపూరిత ఆదాయాన్ని దాచడానికి ఆ ఆస్తిని భార్య పేరిట రిజిస్టర్ చేసినట్లు తేలింది.
ఇంటి నిర్మాణ నిధులపై నిబంధనలు ఏమిటి?
భారతదేశంలో ఆస్తుల కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. భారీ వ్యయంతో కూడిన నిర్మాణాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయో యజమాని నిరూపించాల్సి ఉంటుంది. ఒకరు డబ్బు చెల్లించి, మరొకరి పేరు మీద (భార్య, పిల్లలు లేదా ఇతరులు) ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ నిధులకు సరైన లెక్క లేని పక్షంలో దానిని 'బినామీ' ఆస్తిగా పరిగణిస్తారు. ఎన్డీపీఎస్ సెక్షన్ 68 (E) ప్రకారం.. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులు తమ నేరాల ద్వారా ఆర్జించిన డబ్బుతో కొన్న ఆస్తులను గుర్తించి, వాటిని స్తంభింపజేసే అధికారం పోలీసులకు, కేంద్ర సంస్థలకు ఉంటుంది.
భవిష్యత్తులో స్వాధీనం చేసుకుంటారా?
అవును, అక్రమ సొమ్ముతో నిర్మించిన ఆస్తులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అలాంటి ఇళ్లను ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రాథమిక ఆధారాలు లభించిన వెంటనే ఆ ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా పోలీసులు స్తంభింపజేస్తారు. కోర్టులో నేరం నిరూపితమైతే, సదరు ఆస్తిని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. నాగౌర్ కేసులో కూడా ఎస్పీ రోషన్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, సదరు నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది.
కొన్ని రాష్ట్రాల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నేరస్థులు నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం గౌరవం. కానీ, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో నిర్మించిన 'సౌధాలు' ఎంతో కాలం నిలవవు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో రియల్ బూమ్.. ఇప్పుడు ఇక్కడే..


