
సాధారణంగా ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు.. ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత సలువుగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారని ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనంలో వెల్లడైంది.
–సాక్షి, సిటీబ్యూరో
ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే..
మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల సరఫరా పెరిగింది. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కరోనా మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.
వసతులకే ప్రాధాన్యం..
సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, నేటి యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువ సమయం అంటే కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.కోటి –3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.