ఇంధన ధరల షాక్‌      | High Fuel Prices, El Nino impact Agricultural Sector says RBI | Sakshi
Sakshi News home page

ఇంధన ధరల షాక్‌     

May 30 2026 5:24 AM | Updated on May 30 2026 5:24 AM

High Fuel Prices, El Nino impact Agricultural Sector says RBI

అయినా వృద్ధికే ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌

పశ్చిమాసియా ఘర్షణ కొనసాగితే రిస్క్‌ 

వ్యవసాయ ఉత్పాదకత తగ్గొచ్చు 

వార్షిక నివేదిక వెల్లడి 

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని.. దీనికితోడు ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయరంగం ఉత్పాదకతను దెబ్బతీయొచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అయినప్పటికీ కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్లు పటిష్టంగా ఉండడం, ప్రభుత్వం నుంచి మూలధన వ్యయాలు మెరుగ్గా ఉండడం, పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు, వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని 2025–26 సంవత్సరం ఆర్‌బీఐ వార్షిక నివేదిక పేర్కొంది.  

ఆర్థిక వృద్ధి.. 
2025–26లో విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేసింది. బలమైన ప్రైవేటు వినియోగం, స్థిరమైన పెట్టుబడులు, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలించాయి. 2026–27 సంవత్సరానికి సైతం బలమైన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వృద్ధిపై అంచనాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే పశ్చిమాసియా ఘర్షణ ఎక్కువ కాలం పాటు కొనసాగితే వృద్ధి తగ్గిపోయే రిస్క్‌ ఉంది. అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు, వాతావరణ సంబంధిత ప్రతికూలతలు స్వల్పకాలంలో వృద్ధి తగ్గేందుకు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. 

వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్‌ 
నైరుతి రుతుపవనాల పురోగతి, విస్తరణపైనే 2026–27లో వ్యవసాయ రంగం వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేయొచ్చు. జూన్‌–సెప్టెంబర్‌ నైరుతి కాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 90 శాతంగా ఉండొచ్చంటూ వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించడం గమనార్హం.  

అదుపులోనే ధరలు.. 
ద్రవ్యోల్బణం లకి‡్ష్యత శ్రేణిలోనే (4ప్లస్‌2) ఉండొచ్చు. సరిపడినన్ని ఆహార నిల్వలు, రిజర్వాయర్లలో తగినంత నీటి వనరులు ఉన్నందున ఎల్‌నినో తదితర అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ధరలు అదుపులోనే ఉండొచ్చు. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు, కమోడిటీ ధరలు పెరిగిపోవడం, తయారీ, వేతన వ్యయాలు అధికం కావడం, కరెన్సీ మారకం విలువపై ప్రభావం పడడం వంటివి ద్రవ్యోల్బణాన్ని పెంచే రిస్క్‌ కూడా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే 2026–27లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6 శాతం స్థాయిలో ఉండొచ్చు. ఇంతకంటే కొంత అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.  

రూ.48,021 కోట్ల మోసాలు 
2025–26లో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో రూ.48,021 కోట్ల విలువకు సంబంధించి 10,114 మోసం కేసులు నమోదయ్యాయి. 2024–25లో 23,722 కేసులకు సంబంధించి మోసపోయిన మొత్తం రూ.32,803 కోట్లుగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఆర్థిక మోసాల కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. మోసపోయిన మొత్తం పెరుగుతూ పోతోంది. కార్డు/ఇంటర్‌నెట్‌/డిజిటల్‌ చెల్లింపులకు సంబంధించి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి.  

రూపాయి వర్తకం 
రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు ఆర్‌బీఐ గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రూపాయి వర్తకం పెరుగుతోంది. 2022 ఆగస్ట్‌ నుంచి 2025 జూలై మధ్యకాలంలో దిగుమతులకు సంబంధించి ఏటా 20.9 శాతం, ఎగుమతులకు సంబంధించి రూపాయి ఇన్‌వాయిసింగ్‌ ఏటా 12.7 శాతం చొప్పున పెరిగింది. 2025–26లో రూపాయి ఇన్‌వాయిసింగ్‌ విలువ రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. 2023–24లో ఇది రూ.1.94 లక్షల కోట్లు కావడం గమనార్హం.  

రూ.20, రూ.500 నకిలీ నోట్లు ఎక్కువ 
గత ఆర్థిక సంవత్సరంలో 2,29,746 నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 5.7 శాతం పెరిగాయి. వీటిల్లో రూ.20, రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇతర డినామినేషన్‌ నోట్లలో నకిలీలు తగ్గాయి. వ్యవస్థలో అన్ని నోట్లలోకి రూ.500 నోట్ల చలామణి ఎక్కువగా ఉంది. 2025–26లో 11.2 శాతం పెరిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement