న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ అతాను చక్రవర్తి చేసిన ఆరోపణలపై స్వతంత్ర పరిశీలనకుగాను న్యాయ సంస్థలను బ్యాంక్ నియమించింది. వాస్తవాల ఆధారంగా ఆరోపణల నిగ్గు తేల్చేందుకు న్యాయ సంస్థలను నియమించినట్టు బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బ్యాంక్ పాటిస్తూ వచ్చిన అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఈ నియామకం చేసినట్టు చెప్పారు.
నైతిక పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ అతాను చక్రవర్తి ఈ నెల 18న అర్ధంతరంగా హెచ్డీఎఫ్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ‘‘గత రెండేళ్లలో బ్యాంక్ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, అనుసరిస్తున్న విధానాలను పరిశీలించగా, నా వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవు. నా రాజీనామాకు కారణాలు ఇవే’’అని చక్రవర్తి పేర్కొన్నారు.


