ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయానికి దారి దొరికిందా? | Government Targets Two Key Bidders for IDBI Bank Privatization | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయానికి దారి దొరికిందా?

Apr 10 2026 2:12 PM | Updated on Apr 10 2026 2:34 PM

Government Targets Two Key Bidders for IDBI Bank Privatization

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్‌ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్‌ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్, అసెట్‌ మానిటైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్‌ బిడ్‌ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

ఇది బ్యాంక్‌ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్‌ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్‌వత్సా సంస్థ ఫెయిర్‌ఫాక్స్, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ దాఖలు చేశాయి. బ్యాంక్‌లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement