2028 మార్చి నాటికి 30 లక్షల కోట్లకు మార్కెట్
బ్యాంకులకు మించి ఎన్బీఎఫ్సీల వృద్ధి 67 శాతం జంప్
ఇక్రా నివేదిక
ముంబై: పసిడిపై రుణాలు తీసుకునేందుకు ఇటు ప్రజలు, ఇచ్చేందుకు అటు ఆర్థిక సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం రుణ మార్కెట్ 2028 మార్చి నాటికి రూ. 30 లక్షల కోట్లకు చేరనుంది. 2026 మార్చి నెలలో రూ. 18 లక్షల కోట్లుగా ఉన్న ఈ మార్కెట్ ఏకంగా 67 శాతం వృద్ధి చెందనుంది. ఈ క్రమంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం .. బ్యాంకులకు మించి 35 శాతం మేర వృద్ధి చెందనుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పోర్ట్ఫోలియోలో వాటి వాటా 22 శాతంగా ఉండగా 2028 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 23 శాతానికి చేరనుంది.
అయితే గణనీయమైన పోటీ వల్ల వాటి రాబడులపై ఒత్తిడి నెలకొంటుందని, విస్తరణ ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని ఇక్రా రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో 2026–27, 2027–28 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 35 శాతం మేర వృద్ధి చెందనుంది. బ్యాంకుల లోన్ బుక్ 30 శాతం మేర వృద్ధి చెందనుంది. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పూర్వం రెండేళ్ల పాటు పసిడి రుణాలు 38 శాతం పెరిగాయి. బ్యాంకులు 35 శాతం, ఎన్బీఎఫ్సీలు 54 శాతం వృద్ధి సాధించాయి.
కొత్త సంస్థలతో జోష్..
ఇటీవలి కాలంలో అన్సెక్యూర్డ్ రుణాల విభాగంలో ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో పసిడిలాంటి సెక్యూర్డ్ రుణాల విభాగం మరింతగా వృద్ధి చెందనుందని ఇక్రా సెక్టార్ హెడ్ ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. కొత్త సంస్థలు రావడం, ఇప్పటికే ఉన్నవి శాఖల నెట్వర్క్ను విస్తరిస్తుండటం ఇందుకు దోహదపడుతుందని వివరించారు.
రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..
→ ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా వ్యాపారం లేదా సొంత వినియోగ అవసరాల కోసం ఉద్దేశించిన రిటైల్ పసిడి రుణాలపై (జీఎల్) ఫోకస్ చేస్తున్నాయి. 2026 మార్చి ఆఖరు నాటికి వాటి ఏయూఎం రూ. 4 లక్షల కోట్లుగా ఉంది.
→ బ్యాంకుల్లో రిటైల్ గల్డ్ లోన్లు 2025–26లో దాదాపు రెట్టింపయ్యాయి. వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం ఉద్దేశించిన జీఎల్లు సుమారు 25 శాతం పెరిగాయి. కొత్త రుణాలకు డిమాండ్ ఏర్పడటంతో పాటు కొన్ని రుణాలను వ్యవసాయం నుంచి రిటైల్ రుణాల కేటగిరీలోకి మార్చడం కూడా ఇందుకు కారణం.
→ తనఖా ఉంచిన పసిడి పరిమాణం పెద్దగా పెరగకపోయినప్పటికీ పసిడి ధరలు అధిక స్థాయిలో ఉండటమనేది గోల్డ్ లోన్స్ మార్కెట్ వృద్ధిలో చాలా కీలక పాత్ర
పోషిస్తోంది.
→ 2021–22 నుంచి 2025–26 మధ్య కాలంలో పెద్ద సంస్థల లోన్ బుక్ 24 % పెరగ్గా, తనఖా ఉంచిన పసిడి ఆభరణాల టన్నేజీ ఒక మోస్తరుగా 3–4% వృద్ధి చెందింది.


