పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. త్వరలోనే ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని ఎరువుల నిల్వలు ఉండటం రైతులకు ఊరట కలిగించే శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, సబ్సిడీలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డా. అశోక్ గులాటి తెలిపిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తనున్న ఎరువుల సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలి. ఖరీఫ్ సాగు సీజన్ త్వరలో మొదలవనున్న నేపథ్యంలో మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయన్నది రైతులకు శుభవార్త.
ఇక రెండోది మన వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా. మనం ఏటా సుమారు 40 మిలియన్ టన్నుల యూరియా వాడుతున్నాం. గతేడాది 11 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇటీవలే ప్రభుత్వం యూరియా దిగుమతి కోసం టన్నుకు 935 డాలర్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రైతులకు విక్రయిస్తున్న ధర సుమారు 65 డాలర్లు.
ఒకవేళ ధరలు పెరగకుంటే ఈ ఏడాది బడ్జెట్లో రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ తడిసిమోపడవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రూ.2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా చల్లారకపోతే, సబ్సిడీ మొత్తం ఏకంగా రూ. 3 లక్షల కోట్లను కూడా దాటిపోవచ్చనేది ఎరువుల శాఖ అధికారుల తాజా లెక్క.
హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనం మరో 2–3 నెలలు పాటు కొనసాగితే, రాయితీల విషయంలో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకు మించిన ఆందోళన ఏంటంటే, ఎరువుల కోసం మనం 70% దిగుమతులపైనే ఆధారపడుతున్నాము.
దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనికి అవసరమైన గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా ఎగబాకుతుంది, మొత్తంమీద ఖరీఫ్ సీజన్ మధ్యలోనో, లేదంటే చివర్లోనో తీవ్రమైన ఎరువుల సంక్షోభం పొంచి ఉంది.
ఎరువుల ధరలు పెంచకపోతే, సబ్సిడీల భారం పెరిగి ద్రవ్యలోటు ఎగబాకుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రూపాయి మరింత పతనం వంటి దుష్ర్పభావాలు తీవ్రమవుతాయి.
ఈ సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని సంస్కరణలకు నడుంబిగించాలి. ఎరువుల ధరల సబ్సిడీ విధానం నుంచి ఆదాయ మద్దతు విధానానికి మారాలి. రైతులతో మాట్లాడి, ఎరువుల ధర రాయితీలకు బదులు ఆదాయపరమైన రాయితీలతో ఆదుకుంటామన్న భరోసా కల్పించాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. అవసరమైతే ‘పీఎం కిసాన్’ పథకంలో విలీనం చేయవచ్చు. దీని ద్వారా కూడా రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీలను నేరుగా ఇవ్వొచ్చు. తద్వారా కనీసం రూ. 40,000 కోట్లు ఆదా చేయగలుగుతారు.
ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీలను ఇప్పుడున్నట్లే ఇవ్వాలనుకుంటే, వినియోగ పరిమితులను విధించాల్సి ఉంటుంది. అంటే, పొలం విస్తీర్ణాన్ని బట్టి, పండించే పంట ఆధారంగా రైతుకు అందించే ఎరువుల పరిమాణాన్ని కేటాయించాలి.
15 ఏళ్లుగా వరి, గోధుమలు.. ఇలా అనేక ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూరియా ధరలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఈ విధానం సరికాదు. ఎరువుల సరఫరా వ్యవస్థలో లీకేజీల (వృథా/అక్రమాలు) కారణంగా సబ్సిడీ నిథులు పక్కదారి పడుతున్నాయి. ఎరువుల ధరలు సహజ మార్కెట్ స్థాయికి చేరుకుంటే, లీకేజీలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.
– డా. అశోక్ గులాటి, వ్యవసాయ ఆర్థికవేత్త


