నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2026 ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజును పెంచనున్నట్లు ప్రకటించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) చేసిన ప్రకటన ఆధారంగా.. జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు, 2008కి అనుగుణంగా వార్షిక రుసుమును పెంచింది.
ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ ఫీజు కోసం రూ.3075 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దీని ధర రూ.3000 ఉండేది. రేపటి నుంచి అదనంగా రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వినియోగం పెరుగుతున్న సమయంలో ఎన్హెచ్ఏఐ ఫీజును పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు హైవేలు, ఎక్స్ప్రెస్వేలపై ఉన్న 1,150 ఫీజు ప్లాజాలలో వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తాయి.
వార్షిక పాస్ ప్రయోజనాలు
యాన్యువల్ పాస్ తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ పాస్ కలిగిన వాహనదారులు.. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.
ఈ పాస్ ఎలా తీసుకోవాలి?
వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ యాన్యువల్ పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.
ఇదీ చదవండి: 'వెంటపడొద్దు.. ఎక్కువ సంపాదిస్తావు': బఫెట్ ఫార్ములా


