కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌! | Elon Musk vs OpenAI Courtroom Clash Could Redefine Future Artificial Intelligence | Sakshi
Sakshi News home page

కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

May 1 2026 8:42 AM | Updated on May 1 2026 10:37 AM

Elon Musk vs OpenAI Courtroom Clash Could Redefine Future Artificial Intelligence

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కోర్టు విచారణలో ఉత్కంఠ నెలకొంది. సంస్థ సహ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రోక్‌మన్‌లపై ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 30న జరిగిన విచారణ వాడీవేడిగా సాగింది. ప్రజా ప్రయోజనం కోసం స్థాపించిన లాభాపేక్ష లేని సంస్థ ఇప్పుడు భారీ వాణిజ్య సంస్థగా మారిందని, ఇది విశ్వాసఘాతకమని మస్క్ గట్టిగా వాదించారు.

కోర్టు గదిలో మాటల యుద్ధం

విచారణ సందర్భంగా ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్, మస్క్‌ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంస్థ లాభాపేక్ష లేని మార్గంలో కాకుండా వాణిజ్య పరంగా వెళ్తుందని తెలిసినా మస్క్ ఎందుకు మౌనంగా ఉన్నారని, పాత ఒప్పంద పత్రాలను (2017 టర్మ్ షీట్) ఉటంకిస్తూ సావిట్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘నేను ఆ పత్రాల్లోని ఫైన్‌ ప్రింట్‌ చదవలేదు. కేవలం శీర్షికను మాత్రమే చూశాను. ఆల్ట్‌మన్, ఇతరులు ఇచ్చిన హామీలనే నమ్మాను’ అని మస్క్ బదులిచ్చారు. సావిట్ పదేపదే తనను మధ్యలో ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ‘మీరు నన్ను ప్రతిసారీ నియంత్రించాలనుకుంటే సమాధానాలు ఎలా పూర్తవుతాయి?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ స్పందిస్తూ, న్యాయవాదిని హెచ్చరించినప్పటికీ మస్క్ చేసిన అభ్యంతరాలను పూర్తిగా సమర్థించలేదు.

నమ్మకద్రోహం జరిగింది

తాను ఓపెన్ ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతుందని విశ్వసించి మద్దతు ఇచ్చానని, అయితే ఇప్పుడు అది నిబంధనలను ఉల్లంఘిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఒక స్వచ్ఛంద సంస్థ తీరును మార్చకూడదు’ అని అన్నారు. ఈ కేసులో భాగంగా ఆయన 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు సంస్థ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని, ఆల్ట్‌మన్, బ్రోక్‌మన్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఓపెన్ ఏఐ ప్రతివ్యూహం

మరోవైపు, మస్క్ వాదనలను ఓపెన్ ఏఐ తోసిపుచ్చింది. మస్క్ కేసును ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాశకు గురైన మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐకి పోటీగా ఉన్న ఓపెన్ ఏఐని బలహీనపరిచేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. అంతేకాకుండా, మస్క్ కూడా తన సొంత ఏఐ మోడళ్లను ధ్రువీకరించుకోవడానికి ఇతర ఏఐలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.

న్యాయమూర్తి క్లాస్

విచారణలో ఏఐ వల్ల మానవాళికి రాబోయే ముప్పు గురించి మస్క్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే ప్రమాదం నిజం, మనమందరం చనిపోవచ్చు’ అని వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి రోజర్స్ తోసిపుచ్చారు. ‘మీ క్లయింట్ (మస్క్) కూడా అదే రంగంలో సంస్థను నడుపుతున్నారు కదా.. మరి ప్రమాదాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఇది భద్రతా ప్రమాణాల విచారణ కాదని, ఒప్పంద ఉల్లంఘనల కేసు అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 850 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సంస్థగా ఎదిగిన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement