విదేశాల్లో, అందులోనూ దుబాయ్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న భారతీయులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను (ఐసీసీ) ఉపయోగించి దుబాయ్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన పలువురికి నోటీసులు జారీ అవుతున్నాయి. అజాగ్రత్తగా చేసిన ఈ లావాదేవీలు ఇప్పుడు ‘ఫెమా’ ఉల్లంఘనల కింద ఇన్వెస్టర్లను ఇరకాటంలో పడేసింది.
అసలు ఏం జరిగింది?
దుబాయ్లోని రియల్ ఎస్టేట్ డెవలపర్లు పంపిన పేమెంట్ లింక్ల ద్వారా లేదా నేరుగా అక్కడికి వెళ్లినప్పుడు క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు భారీగా చెల్లింపులు చేశారు. ప్రాథమిక డిపాజిట్లు చెల్లించడానికి చాలా మంది ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే, భారతీయ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాల ప్రకారం ఇది తీవ్రమైన నేరం.
చట్టం ఏం చెబుతోంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక భారతీయుడు ఏడాదికి గరిష్టంగా 2,50,000 డాలర్ల వరకు మాత్రమే విదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది అధికారిక బ్యాంకింగ్ ఛానెల్స్ ద్వారానే జరగాలి. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను కేవలం కరెంట్ అకౌంట్ లావాదేవీలకే (హోటల్ బిల్లులు, షాపింగ్, సర్వీసులు) వాడాలి. క్రెడిట్ కార్డ్ లావాదేవీ అనేది ఒక రకమైన స్వల్పకాలిక రుణం. విదేశాల్లో ఆస్తులు కొనడానికి క్రెడిట్ కార్డులో అప్పు తీసుకోవడాన్ని ఆర్బీఐ నిషేధిస్తుంది.
ఇన్వెస్టర్ల పరిస్థితి
నోటీసులు అందుకున్న వారు ఇప్పుడు అటు ఆస్తిని వదులుకోలేక, ఇటు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపును వెనక్కి తీసుకోవాలని బిల్డర్ను కోరవచ్చు. అయితే, కొత్తగా నిధులు పంపాలంటే ప్రస్తుత డాలర్ రేటు ప్రకారం భారీగా ఖర్చవుతుంది. నిబంధనల ఉల్లంఘనకు గానూ జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ప్రస్తుతం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత మందగించడంతో ఆస్తిని తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది.
పరిష్కారం ఉందా?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇన్వెస్టర్లు ‘కాంపౌండింగ్’ ప్రక్రియ ద్వారా ఈ సమస్యను సరిదిద్దుకోవచ్చు. తాము తెలియక చేసిన పొరపాటును అంగీకరిస్తూ ఆర్బీఐ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ నిధుల మూలాలు సక్రమంగా ఉండి హవాలా వంటి అక్రమ మార్గాలు లేవని తేలితే ఈడీ అభ్యంతరం చెప్పకపోవచ్చు. నిబంధనల ప్రకారం కొంత జరిమానా చెల్లించి లావాదేవీని రెగ్యులరైజ్ చేయవచ్చు. ఒకవేళ పొరపాటు చిన్నదైతే ఆర్బీఐ రూ.2 లక్షల వరకు పెనాల్టీతో సరిపెట్టే అవకాశం ఉంది.
విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం సౌలభ్యం కోసం క్రెడిట్ కార్డులను వాడటం ముప్పును కొనితెచ్చుకోవడమే. ఇన్వెస్టర్లు నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలి.
ఇదీ చదవండి: భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్


