ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్‌ కంపెనీ అధినేత హామీ | Dubai Tycoon Rizwan Sajan Assures 6000 Employees Jobs and Salaries Are Safe | Sakshi
Sakshi News home page

ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్‌ కంపెనీ అధినేత హామీ

Apr 2 2026 1:45 PM | Updated on Apr 2 2026 2:39 PM

Dubai Tycoon Rizwan Sajan Assures 6000 Employees Jobs and Salaries Are Safe

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.

కుటుంబంలా అండగా ఉంటాం
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్‌లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.

ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.

హార్డ్‌వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..
రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు.  ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

ఇటీవల దుబాయ్‌లో 55 అంతస్తుల వాణిజ్య టవర్‌ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement