ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో వాహనదారులకు మరోసారి ఇంధన భారం పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) సీఎన్జీ ధరలను కిలోకు రూ.2 పెంచింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.84 నుంచి రూ.86కు చేరుకుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
పీఎన్జీ ధరలకూ పెరుగుదల
సీఎన్జీతో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలను కూడా ఎంజీఎల్ పెంచింది. యూనిట్కు 50 పైసలు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు యూనిట్కు రూ.52 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల 31 లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభావం పడనుంది.
పెరుగుతున్న గ్యాస్ సేకరణ ఖర్చులే కారణం
దేశీయ గ్యాస్ కేటాయింపులు తగ్గడం, అధిక ధరలతో గ్యాస్ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో గ్యాస్ సేకరణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎంజీఎల్ వెల్లడించింది. అయినప్పటికీ ఖర్చులను తగ్గిస్తూ వినియోగదారులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇటీవలి కాలంలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత మే 14న కూడా ఎంజీఎల్ కిలోకు రూ.2 చొప్పున ధరలను పెంచింది. తాజా పెంపుతో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, బస్సులు సహా సీఎన్జీ ఆధారిత రవాణా సేవల నిర్వహణ వ్యయాలు మరింత పెరగనున్నాయి.
ముంబై, థానే, నవీ ముంబైతో పాటు ఎంఎంఆర్లోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరల పెంపు అమలులోకి వచ్చింది. ఎంజీఎల్ గ్యాస్ సరఫరా నెట్వర్క్ కళ్యాణ్, రాయ్గఢ్, రత్నగిరి, లాతూర్, ఉస్మానాబాద్, చిత్రదుర్గ, దావణగెరె వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది.
పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఇంకా చౌకే
ధరలు పెరిగినా కిలోమీటరుకు అయ్యే నిర్వహణ వ్యయ పరంగా సీఎన్జీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే చౌకైన ప్రత్యామ్నాయంగానే కొనసాగుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా, డీజిల్ ధర రూ.97.83గా నమోదైంది. దీంతో రవాణా రంగంపై ఇంధన వ్యయాల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.


