సవాళ్లున్నాయి, కానీ సంక్షోభం లేదు | challenges exist but no economic crisis india arvind panagariya | Sakshi
Sakshi News home page

సవాళ్లున్నాయి, కానీ సంక్షోభం లేదు

May 30 2026 6:03 PM | Updated on May 30 2026 6:42 PM

challenges exist but no economic crisis india arvind panagariya

ఎకానమీ టాక్‌

  •     పశ్చిమాసియా సంక్షోభం, ఇతరత్రా విదేశీ షాక్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీని తీవ్రత మన కళ్ల ముందు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వల తగ్గుముఖం, దిగుమతుల భారం, రూపాయి పతనం, ఎరువుల రాయితీలు భారీగా ఎగబాకడం, పెట్రో ధరల పెంపు వంటివి చూస్తున్నాం. అయితే, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందన్నదే అసలు ప్రశ్న.

  •     విదేశీ షాక్‌ల విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సరైన దిశలోనే ఉన్నాయి. పలు రంగాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిరావచ్చు.

  •      అయితే, కొంతమంది భయాందోళనలకు గురిచేస్తున్నట్లుగా మన ఎకానమీలో ఏదో సంక్షోభం నెలకొందని అనిపించడం లేదు. చాలా పటిష్టంగానే ఉందని భావిస్తున్నా. గత మూడేళ్లుగా జీడీపీ సగటున 7.3% వృద్ధి చెందింది. మూడేళ్లలో ద్రవ్యోల్బణం సగటున సుమారు 4.3%గా నమోదైంది. కరెంట్‌ ఖాతా లోటు కూడా జీడీపీలో 1% పరిధిలోనే కొనసాగింది.

  •   ఆర్థిక వ్యవస్థలో కొత్తగా నిర్మాణాత్మక సమస్యలేవీ లేవు. మన శ్రామిక శక్తిలో ఇప్పటికీ 46% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. పట్టణీకరణ వేగం పుంజుకోవడం లేదు. రాబోయే దశాబ్దంలో వీటిని చక్కదిద్దాల్సి ఉంది.

  •   విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయన్న విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి కీలకమైన స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (గ్రాస్‌ ఎఫ్‌డీఐలు) చాలా బలంగా ఉన్నాయి. 2024–25లో ఇవి 81 బిలియన్‌ డాలర్లు కాగా, 2025–26లో 94 బిలియన్‌ డాలర్లు. సమస్యేమిటంటే, విదేశీ ఇన్వెస్టర్లు గతంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల గతేడాది సుమారు 20 బిలియన్‌ డాలర్లు వెనక్కి వెళ్లాయి. అలాగే, విదేశీ పరిణామాల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి.

  •   భారత్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూల దృక్పథం మారలేదు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సంస్కరణల్లో చాలా వరకు పూర్తయ్యాయి. అయితే, నియంత్రణపరమైన కొన్ని అడ్డంకులు ఇంకా కొనసాగుతున్నాయి. న్యాయపరమైన సంస్కరణలల్లో పెద్దగా పురోగతి లేదు. రాబోయే దశాబ్దాల్లో వీటితో సహా మరిన్ని భారీ సంస్కరణలు అవసరం.

  •      ప్రధాని పొదుపు చర్యలను ఒక నైతిక సూచనగానే చూడాలి. అయితే, వీటిని ప్రభుత్వాలు ఆచరించి ఆదర్శంగా నిలవాలన్న వాదనతో ఏకీభవిస్తున్నా.

  •      ముఖ్యంగా ఉచిత పథకాలను ఎడాపెడా ఇవ్వడం మంచిది కాదు, కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి మినహాయింపు. కోవిడ్‌ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గానే ఉంది. రానున్న కాలంలో కేవలం ఉచితాలతోనే ఎన్నికల్లో గెలవలేమని రాజకీయ పార్టీలన్నీ గ్రహిస్తాయని భావిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని ఆపడం సాధ్యం కాదు. మెరుగైన పాలన, సేవలతోనే విజయం లభిస్తుంది. కాలక్రమేణా ఉచిత పథకాలు వాటంతటవే కనుమరుగవుతాయి.

  •     పశ్చిమాసియా సంక్షోభం నేడోరేపో ముగిసినా చమురు సరఫరా వ్యవస్థ మునుపటి స్థాయికి చేరడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది(2026–27) అర శాతం తగ్గి 6.5 శాతానికి చేరవచ్చు. ఒకవేళ ఏడాదంతా ఉద్రిక్తతలు కొనసాగితే 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది.

– డా. అరవింద్‌ పనగారియా, ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement