సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్జీ చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్జీ, సెంట్రల్ బెంగళూరులో ఒక పెంట్హౌస్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.45.71 కోట్లు.
తారిఖ్ ప్రేమ్జీ పెంట్హౌస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్కీ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ద్వారా తెలిసింది. కార్పెట్ ఏరియా 7,065 చదరపు అడుగులు, సూపర్ బిల్ట్-అప్ ఏరియా 10,602 చదరపు అడుగులుగా ఉంది. చదరపు అడుగుకు సుమారుగా రూ. 43,123 చెల్లించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది బెంగళూరులో జరిగిన అతిపెద్ద లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని జాప్కీ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. నగరంలో రిచ్మండ్ టౌన్, ఇంద్రానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న హై-ఎండ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
అజీమ్ ప్రేమ్జీ భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరు మాత్రమే కాకుండా.. ప్రముఖ దాతృత్వవేత్త కూడా. ఈయన స్థాపించిన అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరి కుటుంబం నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. తారిఖ్ కూడా కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉంటూ, వివిధ బోర్డు స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


