
ఈసారి బ్యాంక్ ఆఫ్ బరోడా వంతు..
ఆర్కామ్ రూ. 1,656 కోట్ల ఎగవేత కేసులో చర్యలు
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ రంగంలో ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీని రుణ ఎగవేత కేసులు వెంటాడుతున్నాయి. దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను, అదేవిధంగా ఆ కంపెనీలో మాజీ డైరెక్టర్ అయిన అనిల్ అంబానీని తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది.
దాదాపు దశాబ్దం క్రితం ఆర్కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కూడా ఇవే ఆరోపణలతో ఆర్కామ్, అనిల్ను ‘ఫ్రాడ్’ జాబితాలో చేర్చడం తెలిసిందే.
ఆర్కామ్కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.
ప్రస్తుతం ఆర్కామ్పై దివాలా చట్టం ప్రకారం ఎన్సీఎల్టీలో కేసు నడుస్తోంది. కాగా, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాను ‘ఫ్రాడ్’గా ప్రకటించిన తర్వాత, దానిపై క్రిమినల్ చర్యల నిమిత్తం దర్యాప్తు సంస్థలకు కూడా సంబంధిత బ్యాంక్ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఐదేళ్ల పాటు కొత్తగా ఎలాంటి రుణం పుట్టకుండా రుణగ్రహీతను నిషేధించాలి. ఈ ఏడాది మార్చి నాటికి ఆర్కామ్ మొత్తం అప్పులు రూ.40,400 కోట్లుగా లెక్కతేలింది.
మాపై ప్రభావం లేదు: ఆర్పవర్ ఆర్కామ్ ఖాతా విషయంలో బీవోబీ చేపట్టిన చర్యల వల్ల తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం లేదని రిలయన్స్ పవర్ (ఆర్పవర్) పేర్కొంది. ఇది కూడా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీయే. కాగా, తమది ప్రత్యేక, స్వతంత్ర లిస్టెడ్ కంపెనీ అని, ఆర్కామ్తో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఏవీ లేవని ఆర్పవర్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది.