టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిర్ ఇండియా కంపెనీ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో కీలక పాత్ర పోషించిన విల్సన్ తన పదవీకాలం ముగియక ముందే తప్పుకోవడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల క్రితం ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ సంస్థలో భారీ మార్పులు వస్తాయని ఆశించింది. అయితే, ఊహించిన దానికంటే పరివర్తన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.
ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. కొత్త సీఈఓను నియమించే వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఆయన తన నోటీసు పీరియడ్లో ఉన్నారు. తన నిష్క్రమణకుగల కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది జూన్లో జరిగిన ఏఐ 171 అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వెలువడిన అనంతరం ఆయన పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగోలో కూడా ఇటీవల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన రాజీనామాను ప్రకటించగా సంస్థ ఇప్పటికే కంపెనీ చీఫ్ను ప్రకటించింది. ఆయన ఆగస్టు నాటికి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఎయిర్ ఇండియా విషయంలో టాటా గ్రూప్ కొన్ని నెలల క్రితమే కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు సరైన అభ్యర్థి దొరకలేదు. ఇండిగో తన కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకోగా, ఎయిర్ ఇండియా చీఫ్ కోసం కొందరి పేర్లను పరిశీలిస్తోంది.
ఇదీ చదవండి: రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే తీవ్ర పరిణామాలు


