ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్ధిక అస్థిరత నెలకొన్న సమయంలో.. 'దేశీ బ్లింగ్' అనే షో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు ప్రారంభమైన వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ప్రసారం కావడం చాలామంది విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొత్తం అతి విలాసవంతమైన జీవితం, బంగారం, డబ్బు, ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంది.
దేశీ బ్లింగ్ కార్యక్రమంలో కనిపించే వ్యక్తులలలో సతీష్ సన్పాల్, ఆయన భార్య తబిందా సన్పాల్ కూడా ఉన్నారు. వీరి జీవితం చాలా విలాసవంతం. నిజానికి సతీష్ భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ.. దుబాయ్ వెళ్లి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి దుబాయ్కు వెళ్లినప్పుడు తనదగ్గర చాలా తక్కువ మొత్తం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను దుబాయ్లో బిలినీయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

40 కేజీల బంగారం!
ఈ కార్యక్రమంలో సతీష్ సన్పాల్ బంగారం పట్ల వారికున్న అభిరుచిని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 40 కిలోల బంగారం తనవద్ద ఉందని టబిందా సన్పాల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన భర్త తనకు 3 కిలోల బంగారం కొనిస్తాడని కూడా వెల్లడించింది. వారి ఇంట్లో బంగారు ఆభరణాలతో నిండిన ప్రత్యేక గది ఉందని, అది ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్లా కనిపిస్తుందని చెప్పారు.
తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు పాత్రలు వాడటం, మొదటి పుట్టినరోజుకు 24 క్యారెట్ బంగారంతో ప్రత్యేక దుస్తులు తయారు చేయించడం వంటి విషయాలు వెల్లడించారు. వీరు బుర్జ్ ఖలీఫాలో నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.
ఏడాది కుమార్తె కోసం రోల్స్ రాయిస్
తమ ఏడాది పాప కోసం గులాబీ రంగులో ఉన్న కస్టమైజ్ రోల్స్ రాయిస్ కొన్న విషయం కూడా ఈ షోలో వెల్లడించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా విలాసానికి ప్రతీకగా మార్చడం ఈ కుటుంబ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సతీష్ తన స్నేహితులతో గడపడానికి ప్రత్యేకంగా యాచ్ కొనుగోలు చేసి పార్టీలకు ఉపయోగించడం కూడా షోలో వెల్లడించారు.

ఎవరీ సతీష్ సన్పాల్?
సతీష్ సన్పాల్ వ్యాపార జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి ఈయన ఎనిమిదో తరగతి వరకే చదివి, చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట తన తల్లి నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం ప్రారంభించాడు. అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది.
ఆ తరువాత దుబాయ్ వెళ్లి.. ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత దీని గురించి అవగాహన పెంచుకున్నాడు. ఇలా.. 2018లో అనక్స్ హోల్డింగ్ ప్రారంభించాడు. ఇది క్రమంగా భారీ వ్యాపార సమ్మేళనంగా మారింది. ఈ సంస్థకు దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. కాగా ఈయన నికర విలువ మొత్తం రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.
ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!


