● రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో తీర్మానం ● 93 మందితో నూతన కమిటీ ఎన్నిక
రుద్రంపూర్: భవిష్యత్లో రైతు సమస్యలపై ఉద్యమించాలని రైతు సంఘం మహాసభల్లో తీర్మానించారు. ఈ నెల 23 నుంచి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైతులకు సంబంధించిన 30 అంశాలపై తీర్మానాలు రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయ ప్రణాళికను శాసీ్త్రయంగా రూపొందించాలని, పంటలకు సక్రమంగా సాగునీరు అందించాలని, భూభారతి, ధరణి చట్టాలను సరిచేయాలని, పోడు సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలని, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభల్లో తీర్మానించినట్లు వివరించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 2400 చెల్లించాలని కోరారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామని తెలిపారు.
నూతన కమిటీ ఎన్నిక
మహాసభలో 93 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శిగా తీగల సాగర్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి, రమేష్, కందాల ప్రమీల, మల్లు నాగార్జునరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, శెట్టి వెంకన్న, ఎం.శ్రీనివాస్, తుమ్మల వెంకటరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, శీలం ఫకీరమ్మ, లెల్లల బాలకృష్ణ, ఉడుత రవీందర్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్ గౌడ్, ఈసంపల్లి బాబు, వెంకటేశ్, బాల్రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, వెంకట్, మావో, దుబ్బాక రాంచందర్, చందు నాయక్, కోశాధికారిగా మూడుశోభన్లను ఎన్నుకున్నారు.


