● ప్రభుత్వ హామీలతో ముగిసిన సమ్మె ● డిపోల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
చుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు శనివారం విధుల్లో చేరారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో ఎట్టకేలకు శనివారం ఉదయం కార్మికులు సమ్మె విరమించారు. జిల్లాలో ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు కొనసాగిన సమ్మె ముగియడంతో అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులు తిరుగుతున్నాయి. అధికారులు డిపోల వారీగా షిఫ్టుల ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించారు. సమ్మెతో జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో దాదాపు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, రెండు రోజులపాటు తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శనివారం సైతం విధులకు రాగా, అధికారులు తిప్పి పంపించారు.
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ కార్మికులు డిపోల పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్ రావు, వైఎన్ రావు, పీఎన్ రావు, కర్నాటి నగేష్, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, సింగ్, అనిల్, కిరణ్, నజీర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


