గుండాల: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో పీఓ రాహుల్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్, గేమ్స్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి పలు క్రీడల్లో గిరిజన విద్యార్థులకు తర్ఫీదు ఇస్తామని ఇల్లెందు ఏటీడీఓ భారతిదేవి అన్నారు. శనివారం కాచనపల్లి క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ జరుపుల కిషన్తో కలిసి ఆమె ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, యోగా, డ్యాన్స్, పెయింటింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, వ్యాసరచన, ఒక్క నిమిషం ప్రసంగం, దేశభక్తి గీతాలు.. లాంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తామని వెల్లడించారు. మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొంటుండగా.. మే 9వ తేదీ వరకు శిబిరం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఏసీఎంఓ రాములు, డిప్యూటీ వార్డెన్ జి.పాపయ్య, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ బండ రాంబాబు, క్యాంప్ ఇంచార్జ్ పి.శిరోమణి తదితరులు పాల్గొన్నారు.


