సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వివరాలు, కొనుగోలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపాలని చెప్పారు. టేకులపల్లి ప్రాంతంలో ఏర్పడ్డ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, సే నో టు డ్రగ్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
వృత్తి నైపుణ్యం అవసరం
యువతకు విద్యతోపాటు వృత్తి నైపుణ్యం అవసరమని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నవ మహిళా సాధికార కేంద్రం, ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీ, వెల్డింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించారు. తాటి ఆకులతో బుట్టల తయారీ వల్ల వచ్చిన నగదు రూ.63,821 చెక్కును అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, డీపీఓ సుధీర్, నవ లిమిటెడ్ అధికారులు ఎం.శ్రీనివాసరావు, కె.సంజయ్కుమార్, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పోస్టర్లు ఆవిష్కరణ
మన జనగణన – మన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆవిష్కరించారు.సీపీఓ సంజీవరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


