భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు చేపట్టిన మార్కింగ్ ప్రక్రియను శుక్రవారం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆలయం చుట్టూ ప్రభుత్వం సేకరించిన భూమి, మాఢ వీధుల విస్తరణపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ కోసం గతంలోనే నిబంధనల ప్రకారం భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం అందించామని తెలిపారు. సేకరించిన భూమిని పంచనామా నిర్వహించి దేవాదాయ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయని వివరించారు.


