బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వేసవిలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని డీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆమె పరిశీలించారు. కేజీబీవీలోని క్లాస్రూమ్స్, వంటగదులు, భోజనశాల, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందించి, మాట్లాడారు. ప్రభుత్వం విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో అదేస్థాయిలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలని, ఉపాధ్యాయులు విద్యాబోధన తీరును ఎప్పటికప్పుడు మార్చుకుని, నాణ్యతతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వేసవిలో ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి యదుసింహరాజు, కేజీబీవీ ప్రిన్సిపాల్ సుశీల, హెచ్ఎం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.


