● రామ్జీ చట్టం బోగస్, ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం ● రైతు సంఘం మహాసభలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్దావలె
రుద్రంపూర్: రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణలో కమ్యూనిస్టులు భూములు పంచితే.. పాలకులు వాటిని గుంజుకుంటున్నారని ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలే ఆరోపించారు. గురువారం కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్లో మూడు రోజులపాటు జరిగే రైతు సంఘం 3వ మహాసభలను ఆయన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సామినేని రామారావు, కాసాని ఐలయ్యకు నివాళులర్పించి, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రామ్జీ చట్టం బోగస్ అని, బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది వీరమరణం పొందారని, పది లక్షల ఎకరాల భూములను కమ్యూనిస్టులు పంచారని గుర్తుచేశారు. నేడు ఏ రాష్ట్రంలో చూసినా కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు పేదల భూములను గుంజుకుంటున్నాయని, దీంతో రైతులు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం ధనికుల చేతుల్లో 80 శాతం భూములున్నాయని, దీంతో అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతులతోపాటు దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. అనంతరం ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్ఞాకృష్ణన్ మాట్లాడారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, బి.వెంకట్, సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, జంగారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, కందాల ప్రమీల, యలమంచిలి వంశీకృష్ణ, వెంకట్రాములు, బుర్రి ప్రసాద్, శివరాంప్రసాద్, రవికుమార్, శ్రీరాంనాయక్, ఆశయ్య, రవీందర్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, లిక్కి బాలరాజు పాల్గొన్నారు.


