రుద్రంపూర్: కొత్తగూడెంలో గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తెలిపారు. కొత్తగూడెంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో ఢిల్లీ రైతు పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కిషన్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. భూమి హక్కులు, సాగునీరు, కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, రుణమాఫీ, రైతు భరోసా, పెండింగ్లో ఉన్న అటవీ హక్కులు తదితర సమస్యలపై సభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ జానయ్య, ఏఐకేఎస్ జాతీయకార్యదర్శి విజ్జు కిషన్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో శివరాం ప్రసాద్, మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, అన్నవరం సత్యనారాయణ, కొలగాని బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, లిక్కి బాలరాజు, కున్సోత్ ధర్మా, తదితరులు పాల్గొన్నారు.


